డైరెక్ట్గా బుల్లితెరపైకి.. సముద్రఖని సినిమా
ABN , First Publish Date - 2021-07-07T00:40:26+05:30 IST
సాధారణంగా ఒక సినిమా విడుదలై వంద రోజులైన తర్వాత టీవీల్లో ప్రసారమవుతుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పుడు పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా

కోలీవుడ్: సాధారణంగా ఒక సినిమా విడుదలై వంద రోజులైన తర్వాత టీవీల్లో ప్రసారమవుతుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పుడు పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సినిమా థియేటర్లు మూతపడివున్నాయి. సినిమా షూటింగులు సైతం కేవలం వందమందితోనే జరుపుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అనేకమంది చిన్న నిర్మాతలు తమ చిత్రాలను విడుదలకు ముందే టీవీలు, ఓటీటీల్లో విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కరోనా కష్టకాలంలో థియేటర్లకు ఎపుడు అనుమతి ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రాలను లాభాలను చూసుకోకుండా విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితి గత యేడాది నుంచి కొనసాగుతోంది.
గత యేడాది దీపావళికి ప్రసన్న, యోగిబాబు, శ్యామ్ నటించిన ‘నాంగళ్ రొంబ బిజీ’ అనే చిత్రం డైరెక్టుగా టీవీలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ యేడాది ‘పులికుత్తి పాండి’, ‘ఏలే’, ‘మండేలా’, ‘సర్బత్’, ‘వణక్కండా మాప్లే’ తదితర చిత్రాలు థియేటర్లలో విడుదల కాకముందే టీవీలో ప్రసారమయ్యాయి. ఆ జాబితాలో ఇపుడు ‘వెళ్ళైయానై’ చేరింది. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రముఖ టీవీలో ప్రసారం కానుంది. సుబ్రహ్మణ్య శివ దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. సముద్రఖని, యోగిబాబు, ఆత్మిక తదితరులు నటించారు. ఇది థియేటర్లో విడుదలకాకుండా టీవీలో డైరెక్టుగా విడుదలవుతున్న ఎనిమిదో చిత్రం కావడం గమనార్హం.