Rajinikanth- Ajith: పండగకి.. పైచేయి ఎవరిదో?
ABN, First Publish Date - 2021-09-14T23:42:07+05:30
దీపావళి రోజున ఇద్దరు అగ్రనటులు తలపడనున్నారు. వారిలో ఒకరు సూపర్స్టార్ రజనీకాంత్ కాగా, మరొకరు అజిత్. వీరిద్దరు నటించిన ‘అణ్ణాత్త’, ‘వలిమై’ చిత్రాలు దీపావళి రోజున రిలీజ్ కానున్నాయి. అయితే, వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కావడం ఇదే మొదటిసారి
దీపావళి రోజున ఇద్దరు అగ్రనటులు తలపడనున్నారు. వారిలో ఒకరు సూపర్స్టార్ రజనీకాంత్ కాగా, మరొకరు అజిత్. వీరిద్దరు నటించిన ‘అణ్ణాత్త’, ‘వలిమై’ చిత్రాలు దీపావళి రోజున రిలీజ్ కానున్నాయి. అయితే, వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా రజనీ నటించిన ‘పేట’, అజిత్ నటించిన ‘విశ్వాసం’ చిత్రాలు దీపావళికి విడుదలయ్యాయి. శివ దర్శకత్వం వహించిన ‘విశ్వాసం’ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ దీపావళికి వీరు నటించిన ‘అణ్ణాత్త’, ‘వలిమై’ రిలీజ్ కానున్నాయి. ఇందులో ‘అణ్ణాత్త’కు శివ దర్శకత్వం వహించారు. అలాగే, ‘వలిమై’ చిత్రాన్ని హెచ్. వినోద్ తెరకెక్కించారు.
‘అణ్ణాత్త’లో రజనీతోపాటు ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్రాజ్, సూరి, సతీష్ తదితరులు నటించారు. ‘వలిమై’లో అజిత్, హ్యూమా ఖురేషీ, కార్తికేయ, యోగిబాబు వంటి ప్రముఖ తారాగాణం నటించారు. ఇదిలా ఉంటే, షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘అణ్ణాత్త’ చిత్రాన్ని నవంబరు 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు నిర్మాణ సంస్థ సన్పిక్చర్స్ అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఇటీవల క్లైమాక్స్ పూర్తి చేసుకున్న ‘వలిమై’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని కూడా దీపావళికి రిలీజ్ చేసేలా చిత్ర నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేశారు. నిజానికి దసరాకు రిలీజ్ చేసేలా ‘వలిమై’ చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ‘వలిమై’ చిత్రం దీపావళి రేస్లోకి వచ్చింది. మరి ఈ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో వేచిచూడాలి. మరోవైపు, ఈ రెండు చిత్రాలను వేర్వేరు తేదీల్లో రిలీజ్ చేయాలని థియేటర్ యజమానులు కోరుతున్నారు.