Puneeth Rajkumar మరణం తర్వాత.. ఫ్యాన్స్ నుంచి కొత్త డిమాండ్.. కర్ణాటక రాష్ట్ర మంత్రి కూడా సపోర్ట్..!
ABN, First Publish Date - 2021-11-08T19:08:02+05:30
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం దేశవ్యాప్తంగా విషాదం కలిగించింది
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం దేశవ్యాప్తంగా విషాదం కలిగించింది. సినీ నటుడిగానే కాకుండా సామాజిక బాధ్యత గల వ్యక్తిగా కూడా ప్రజల మన్ననలు పొందిన పునీత్ చిన్న వయసులోనే మరణించడం ఎంతో మందిని కలిచి వేసింది. 46 ఏళ్ల పునీత్ గత నెల 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్నప్పటికీ పునీత్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరణానంతరం అయినా పునీత్కు `పద్మశ్రీ` ప్రకటించి గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో పునీత్ అభిమానులు విజ్ఞప్తులు చేస్తున్నారు. అభిమానుల డిమాండ్కు కర్ణాటక మంత్రులు కూడా మద్దతు తెలిపారు. కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ఈ డిమాండ్కు మద్దతు ప్రకటించారు. పునీత్ రాజ్కుమార్కు జీవించి ఉన్నప్పుడే పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, ఇప్పటికైనా అతనికి అవార్డు రావాల్సిందేనని అన్నారు. పల్స్ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం పునీత్ పనిచేశాడని, ఆయనకు పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్సింగ్ అన్నారు.