పాన్ ఇండియాగా విడుదల కానున్న సర్కారు వారి పాట..?
ABN , First Publish Date - 2021-12-28T01:28:50+05:30 IST
మోస్ట్ డిజైరబుల్ మేన్ జాబితాలో మహేశ్ బాబు ప్రతి ఏడాది చోటు సంపాదిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు

మోస్ట్ డిజైరబుల్ మేన్ జాబితాలో మహేశ్ బాబు ప్రతి ఏడాది చోటు సంపాదిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీ కెవ్వరు సినిమాలతో వరుసగా హిట్లు కొట్టారు. బాక్సాఫీస్ వద్ద దూకుడును చూపిస్తున్నారు. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘‘ సర్కారు వారి పాట ’’. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2022 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా నిలిచింది. కానీ, వరుసగా చిత్రాలు విడుదల కాబోతుండటంతో పండగ సీజన్ నుంచి తప్పుకొంది. వేసవి రేసులో పోటీపడుతోంది. సంక్రాంతి రేసు నుంచి సినిమాను తప్పించడంతో ఎస్ ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా మహేశ్కు థ్యాంక్స్ చెప్పారు.
టాలీవుడ్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ‘‘ సర్కారు వారి పాట ’’ సినిమాను పాన్ ఇండియాగా విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు, నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు అంటే భారత్ అంత తెలుసు. అందువల్ల సినిమాను పాన్ ఇండియాగా విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. పరశురాం టాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియాగా విడుదల చేయాలంటే కథకి కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, సర్కారు వారి పాట సినిమాను తెలుగులోనే రిలీజ్ చేస్తారా.. తెలుగు వెర్షన్ను డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేస్తారా.. అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.