100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతి లభించేనా?
ABN , First Publish Date - 2021-10-19T22:20:24+05:30 IST
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ,
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం సినిమాల ప్రదర్శనకు ఇంకా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేవలం 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతోనే సినిమాలను ప్రదర్శిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. దీంతో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రజలంతా ఎప్పటిలాగే రోడ్లపై తిరుగుతున్నారు. బస్సులు, రైళ్ళన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కానీ థియేటర్లకు మాత్రమే యాభై శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
అయితే, దసరా పండుగకు అనేక కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో విజయదశమికి పూర్తి స్థాయిలో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కోలీవుడ్ ప్రముఖులు భావించారు. కానీ, ప్రభుత్వం దానిపై సరైన నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో నవంబరు 4వ తేదీన దీపావళి పండుగ రానుంది. అదే రోజున అనేక చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్త’, శింబు నటించిన ‘మానాడు’, విశాల్ - ఆర్య నటించిన ‘ఎనిమి’తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. దీంతో దీపావళి నుంచి వంద శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తారని కోలీవుడ్ భావిస్తోంది.