విఫలమైన ప్రయత్నాలు.. ఓటీటీకే ఫిక్స్
ABN , First Publish Date - 2021-04-29T22:26:58+05:30 IST
హీరో ధనుష్ - దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జగమే తందిరం’. అయితే, ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరో చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో

కోలీవుడ్: హీరో ధనుష్ - దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జగమే తందిరం’. అయితే, ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరో చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో ఈ చిత్రం ఓటీటీలోనే విడుదల కానుంది. నిజానికి హీరో ధనుష్ నటించిన ‘అసురన్’, ‘కర్ణన్’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. కరోనా కష్టకాలంలోనూ ‘కర్ణన్’ మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలో ధనుష్ తొలిసారి గ్యాంగ్స్టర్గా నటించిన జగమే తందితరం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే, ఈ చిత్రం పూర్తికాకముందే ప్రముఖ ఓటీటీతో నిర్మాణ సంస్థ భారీ రేటుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఓటీటీ అంగీకరించకపోవడంతో ఈ చిత్రం థియేటర్లో విడుదల కావడం లేదు. నిజానికి ఈ చిత్రం గత యేడాదే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెండు నెలల క్రితం ప్లాన్ చేశారు. కానీ, అది సాధ్యపడలేదు. ఈ క్రమంలో ఇపుడు కరోనా రెండో దశ వ్యాప్తి అధికంగా వుండటంతో, ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా అనేక కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా థియేటర్లను మూసివేశారు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయాలని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెలలో విడుదల చేయాలని ఓటీటీ ఫ్లాట్ఫాం నిర్ణయించింది. దీంతో ‘అసురన్’, ‘కర్ణన్’ తరహాలో ఈ చిత్రం కూడా మంచి వసూళ్ళు రాబడుతుందన్న ఆశలు గల్లంతయ్యాయి.