రివ్యూ 2021: యువ దర్శకులు.. సత్తా చాటారు!
ABN , First Publish Date - 2021-12-24T03:02:20+05:30 IST
సినిమా పరిశ్రమకు కొత్తనీరు వస్తేనే పరిశ్రమ కళగా ఉంటుందనేవారు దర్శకరత్న దాసరి నారాయణరావు. కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు పరిశ్రమలో అడుగుపెడితేనే కథల్లో కొత్తదనం ఉంటుందని ఆయన తరచూ అంటుండేవారు. అలాంటి వారికి ఇండస్ర్టీలో ఎప్పుడూ చోటు ఉంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యువ దర్శకుల ఎంట్రీతో పరిశ్రమకు కొత్త కథల కళ వచ్చింది. ప్రతిభతో తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న వారు కొందరైతే, కొత్త ప్రయోగం చేశారు అనిపించుకున్నవాళ్లు కొందరున్నారు.

సినిమా పరిశ్రమకు కొత్తనీరు వస్తేనే పరిశ్రమ కళగా ఉంటుందనేవారు దర్శకరత్న దాసరి నారాయణరావు. కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు పరిశ్రమలో అడుగుపెడితేనే కథల్లో కొత్తదనం ఉంటుందని ఆయన తరచూ అంటుండేవారు. అలాంటి వారికి ఇండస్ర్టీలో ఎప్పుడూ చోటు ఉంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యువ దర్శకుల ఎంట్రీతో పరిశ్రమకు కొత్త కథల కళ వచ్చింది. ప్రతిభతో తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న వారు కొందరైతే, కొత్త ప్రయోగం చేశారు అనిపించుకున్నవాళ్లు కొందరున్నారు. 2021లో ప్రతిభతో తమ సత్తా చాటిన యువ దర్శకులపై ఓ లుక్కేద్దాం.
ఉప్పెన: సానా బుచ్చిబాబు
సుకుమార్ దగ్గర చాలాకాలంలగా అసిస్టెంట్గా పని చేసిన సానా బుచ్చిబాబు ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. రెగ్యులర్ లవ్ స్టోరీస్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ‘ఉప్పెన’తో డిఫరెంట్ ప్రేమకథ రుచి చూపించాడు బుచ్చిబాబు. తొలి చిత్రంతో కలెక్షన్ల సునామీతో ట్రెండ్ సెట్ చేశాడు. హీరోగా వైష్ణవ్ తేజ్ –హీరోయిన్గా కృతి శెట్టికి పరిచయ చిత్రం అయినా గుర్తుండిపోయే చిత్రంగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. కొత్త నటీనటులతో ఓ కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నం 100 కోట్ల మార్క్ రీచ్ అవ్వడం సాధారణ విషయం కాదు. ఇప్పుడు రెండో సినిమా ప్లాన్లో ఉన్నారు బుచ్చి.
‘దర్శకురాలు కావలెను’ అనిపించుకుంది: లక్ష్మి సౌజన్య
పెళ్లి.. దానికి ముందే జరిగే ప్రేమకథ. ఈ కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలో వచ్చాయి. కానీ ఆ తరహా కథని తనదైన శైలిలో చూపించి మెప్పించారు లక్ష్మీసౌజన్య. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే మహిళా దర్శకులు ఒక్కో అడుగు వేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. పదేళ్లకు పైగా దర్శకత్వ శాఖలో పని చేసి ‘వరుడు కావలెను’ చిత్రంతో దర్శకురాలు కావలెను’ అనిపించుకున్నారు లక్ష్మీ సౌజన్య. నాగ శౌర్య, రీతు వర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆ రెండు పాత్రలను దర్శకురాలు చూపించిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
రాజ రాజ చోర: హసిత్ గోలి
లాక్డౌన్ తర్వాత విడుదలైన బడ్జెట్ సినిమాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం ‘రాజ రాజ చోర’. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంతో హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమయ్యారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని టెక్నికల్గా కూడా హైయండ్లో చూపించారు. అంతే కాకుండా తన రైటింగ్ స్కిల్స్ , టేకింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా రిలీజైన చాలా రోజుల వరకూ అతని రైటింగ్ స్కిల్స్ గురించి చర్చించుకున్నారు. ప్రస్తుతం రెండో సినిమా కోసం తన దగ్గరున్న కథలను పాలీష్ చేస్తున్నారు హసిత్ గోలి.
విజయ్ కనకమేడల: నాంది
ఇప్పటి వరకూ చూపించని విధంగా హీరోని చూపించాలి.. కొత్త కథతో మెప్పించాలి.. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండాలి అన్న ఆలోచనతో టాలీవుడ్లో అడుగుపెట్టారు యువ దర్శకుడు విజయ్ కనకమేడల. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నాంది’. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించారు. ఈ చిత్రం చూసిన అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమా చూసి చిత్ర బృందాన్ని పిలిచి అభినందించడఫ విశేషం. సినీ పరిశ్రమతోపాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు విజయ్. ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ సినిమా ప్రయత్నాల్లో విజయ్ ఉన్నారని టాక్.
ఎస్.ఆర్ కళ్యాణ మండపం: శ్రీధర్ గాదె
సెకెండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత చిన్న చిత్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీధర్ గాదె తొలి చిత్రంతోనే కమర్షియల్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి కొడుకుల మఽధ్య భావోద్వేగ సన్నివేశాలను బాగా డీల్ చేసి తీరుతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తొలి సినిమా సక్సెస్తో రెండో సినిమాను ఓ పెద్ద బేనర్ లో చేయడానికి సిద్ధమవుతున్నారు.
రాజా విక్రమార్క: శ్రీ సారిపల్లి
‘రాజా విక్రమార్క’ స్పై థ్రిల్లర్తో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీ సారిపల్లి. కార్తికేయను స్పై ఏజెంట్గా చూపించడమే కాకుండా ఆ జానర్కు కామెడీ మిక్స్ చేసి ప్రయోగం చేశాడు. కరోనా వల్ల విడుదల ఆలస్యమైన సరైనా సమయంలో విడుదల చేశారు నిర్మాతలు. మంచి టాక్తోపాటు చక్కని వసూళ్లు రాబట్టిందీ చిత్రం. కార్తికేయతో కౌశిక్ పెగళ్లపాటి తీసిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఫిలాసఫీ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినా ఫిలాసఫీ కథను బాగానే డీల్ చేశాడనే ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు.
అలాగే పద్మశ్రీ డైరెక్టర్గా పరిచయమైన ‘షాదీ ముబారక్’, మున్నా దర్శకత్వం వహించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, రాఘవేంద్ర రావు శిష్యురాలు గౌరీ రోనంకి దర్శకురాలిగా పరిచయమైన చిత్రం ‘పెళ్లి సందడి’, పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి వచ్చిన యువ దర్శకుడు అనిల్ పాదూరి తీసిన ‘రొమాంటిక్’ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. ఈ చిత్రాలతో దర్శకులుగా పరిచయమైన వారంతా తమ సత్తాను చాటుకున్నారు.
- ఆలపాటి మధు
