‘ఆది’, ‘బన్నీ’ చిత్రాల తర్వాత రఘుబాబు రేంజ్ మారిపోయింది: గిరిబాబు (పార్ట్ 19)
ABN, First Publish Date - 2021-05-21T03:01:55+05:30
దర్శకుడు కృష్ణవంశీగారు ‘మురారి’ సినిమాలో మంచి వేషం ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో మా వాడికి కూడా గుర్తింపు వచ్చింది. దాంతో ఆర్టిస్ట్గా రఘుబాబు సమర్థుడు అనే విషయాన్ని నేనే కాదు పరిశ్రమ కూడా గుర్తించింది. అయితే ఏ దశలోనూ వాడి గురించి నేను ఎవరికీ చెప్పలేదు. వేషాలు ఇవ్వమని అడగలేదు
తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్కు షిప్ట్ అయిన తరుణంలో నేను కూడా మా కుటుంబంతో మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చేశాను. మద్రాసు నగరంతో ముప్ఫయ్యేళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆర్టిస్ట్గా నన్ను పెంచి పెద్ద చేసిన నగరమది. అందుకే అటువంటి ప్రదేశాన్ని వీడటం మానసికంగా బాధ కలిగించినా తప్పదు కదా. హైదరాబాద్కు రావడం, మా రెండో అబ్బాయి బోసుబాబు పెళ్లి చేయడం... ఇలా కార్యక్రమాలతో బిజీగా ఉండి చిత్రనిర్మాణం ఆపేశాను. పైగా చిత్రనిర్మాణ పద్ధతులన్నీ మారిపోవడం, ఖర్చులు బాగా పెరిగిపోవడంతో చిన్న సినిమాలు తీయడానికి అనువైన వాతావరణం నాకు కనిపించలేదు. అందుకే నిర్మాణం జోలికి వెళ్లకుండా నటన మీదే దృష్టి కేంద్రీకరించాను. సినిమాలు తీసే రోజుల్లో ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ మా పెద్దబ్బాయి రఘుబాబు పర్యవేక్షించేవాడు. చిత్ర నిర్మాణం ఆపేయడంతో నా విషయాలు, కుటుంబ వ్యవహారాలు చూసేవాడు. అయితే వాడిలో మంచి నటుడున్నాడన్న విషయాన్ని మాత్రం నేను గమనించలేదు. నటించాలనే ఆసక్తి వాడిలోనూ ఉండేది కాదు. సీనియర్ నరేశ్, మా వాడు మద్రాసులో ఉన్న రోజుల నుంచి స్నేహితులు, క్లాస్మేట్స్. నరేశ్ హీరో కావడం, ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయి క్యారక్టర్ ఆర్టిస్ట్ కావడం జరిగాయి. వీళ్లిద్దరూ తరుచూ కలుస్తుండేవారు. ‘రఘుబాబూ.. నీలో టాలెంట్ ఉంది. మంచి ఆర్టిస్ట్వి అవుతావు. ఎందుకు ప్రయత్నించకూడదూ’ అంటుండేవాడు నరేశ్. ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు జోకులు వేయడం, నవ్వించడం రఘుబాబుకి అలవాటు. ‘మీ పెద్దబ్బాయి కామెడీ బాగా చేస్తాడండీ. మంచి జోకులు వేసి మమ్మల్ని నవ్విస్తాడు. మీరెందుకు ఎంకరేజ్ చేయకూడదు’ అని వాడి స్నేహితులు నన్ను కలిసినప్పుడల్లా అంటుండేవారు. మా వాడు మాత్రం ఆ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదు. చెబితే చూద్దాంలే అనుకున్నాను.
అయితే మావాడు నా ప్రమేయం లేకుండా మిత్రుల ప్రోత్సాహంతో సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడు సత్యారెడ్డి ‘దొంగలున్నారు జాగ్రత్త’(1990) పేరుతో ఒక సినిమా తీశాడు. అందులో ఐదుగురు హీరోలు నటించారు. సత్యారెడ్డి తన మిత్రుడు కావడంతో రఘుబాబు అందులో ఒక హీరోగా నటించాడు.. ఆ సినిమాలో నేను విలన్ని. అప్పుడే సెట్లో నటిస్తున్నప్పుడు తొలిసారిగా మా వాడి లోని ఆర్టిస్ట్ని చూశాను. బాగానే చేశాడు. ఆ తర్వాత ఒక తమిళ సినిమాలో నటించాడు. సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్లో కూడా చేశాడు. క్రమక్రమంగా పుంజుకుని బిజీ అయ్యాడు. సీరియల్స్తో పాటు రమణమూర్తిగారితో కలిసి నాటకాలు వేసేవాడు. సీరియల్స్ ద్వారా, నాటకాల ద్వారా నంది అవార్డ్లు కూడా పొందాడు. మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.
మా వాడి గురించి విన్న దర్శకుడు కృష్ణవంశీగారు ‘మురారి’ సినిమాలో మంచి వేషం ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో మా వాడికి కూడా గుర్తింపు వచ్చింది. దాంతో ఆర్టిస్ట్గా రఘుబాబు సమర్థుడు అనే విషయాన్ని నేనే కాదు పరిశ్రమ కూడా గుర్తించింది. అయితే ఏ దశలోనూ వాడి గురించి నేను ఎవరికీ చెప్పలేదు. వేషాలు ఇవ్వమని అడగలేదు. స్వయంకృషితో, సొంత ప్రతిభతో పైకి వచ్చి పేరు తెచ్చుకున్నాడు. ‘ఆది’ చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘బన్నీ’. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం మా వాడికి కలగలేదు. పదేళ్ల తన నటజీవితంలో 250కి పైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఉన్న పాపులర్ కమెడియన్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. కామెడీ ఆర్టిస్ట్గానే కాకుండా విభిన్న పాత్రలను పోషించే సమర్థత సంపాదించుకున్నాడు. తండ్రిగా నా పేరుని నిలబెట్టి మంచి నటుడిగా పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు. నేను కూడా సంవత్సరానికి ఐదారు సినిమాలు చేస్తూ, మిగిలిన సమయంలో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ హ్యాపీగా ఉన్నాను. ఇక మా రెండో అబ్బాయి బోసుబాబు కూడా టీవీ సీరియల్స్తో బిజీగా ఉన్నాడు. అలా మా కుటుంబం నటనకే అంకితమైంది.
(ఇంకా ఉంది)
-వినాయకరావు