‘వరుడు కావలెను’.. సిరివెన్నెల ప్రేమ గీతం విడుదల
ABN , First Publish Date - 2021-09-22T22:55:04+05:30 IST
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా ‘లక్ష్మీ సౌజన్య’ రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 22) ప్రఖ్యాత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా ‘లక్ష్మీ సౌజన్య’ రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 22) ప్రఖ్యాత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాటను ప్రముఖ గాయని చిన్నయి ఆలపించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.
‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ
పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా
ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’’ అంటూ సాగే ఈ పాట చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెరరూపంగా కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మల అభినయం ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను.. అన్నారు.