బాగుండాలి నుండి బతికుంటే చాలు వరకు వెళ్లాం: త్రివిక్రమ్ శ్రీనివాస్
ABN , First Publish Date - 2021-11-22T21:22:42+05:30 IST
మనం చాలా బాగుండాలి అనుకునే దగ్గరి నుంచి బతికుంటే చాలు అని కరోనా నేర్పించిందని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రిసోనెన్స్ కళాశాలలో ఆదివారం రిసో ఫెస్ట్ నిర్వహించారు. ఈ
మనం చాలా బాగుండాలి అనుకునే దగ్గరి నుంచి బతికుంటే చాలు అని కరోనా నేర్పించిందని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రిసోనెన్స్ కళాశాలలో ఆదివారం రిసో ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సభ్యురాలు జస్టిస్ బి. రజని, సినీదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారిలో జోష్ నింపారు.
కరోనా గురించి మాట్లాడుతూ.. వంద కోట్లు పెట్టి సినిమా తీశాం. అది ఏ థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఎన్ని సెంటర్లో ఆడాలి, అమెరికాలో మార్కెట్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో అవన్నీ సడెన్గా చిన్నవై పోయి మనం బాగుంటే చాలు దగ్గరి నుంచి బతికుంటే చాలు అనే స్థాయికి తీసుకువచ్చిందన్నారు. ముందు ఉండటం, తర్వాత బాగుండటం, ఆతర్వాత సక్సెస్ ఫుల్గా ఉండటం సరైందన్నారు. సంతోషంగా ఉండి సక్సెస్ ఫుల్ పర్సన్గా ఉండాలని సూచించారు. జస్టిస్ రజని మాట్లాడుతూ.. రోజూ మనం ఏదో ఒక విషయాన్ని జస్టిస్ చేస్తుంటామని, ఆ జస్టిస్ మనపై మనం చేసుకున్నప్పుడు సక్సెస్ను పొందుతామన్నారు. గతేడాది జేఈఈ, నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు.