తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం సందీప్‌ కిషన్‌ గొప్ప నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-04T02:28:03+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎందరో కరోనాతో ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరూ మానవత్వం చూపించాలని చెబుతూ

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం సందీప్‌ కిషన్‌ గొప్ప నిర్ణయం

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎందరో కరోనాతో ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరూ మానవత్వం చూపించాలని చెబుతూ.. సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఫస్ట్‌ వేవ్‌ టైమ్‌లో కూడా చిత్ర పరిశ్రమ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా.. ప్రజలకు కూడా ఎంతో సహాయం అందింది. ఇప్పుడు కూడా సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా.. ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇంజక్షన్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ.. కరోనాతో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతున్నారు. నిజంగా వారి నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఒకడుగు ముందుకేసి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను నేను తీసుకుంటానంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్‌ ఐడీని ఆయన పోస్ట్‌ చేశారు. 


''ఈ కష్టకాలంలో చిన్నారులెవరైనా కోవిడ్‌ కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయితే.. వారి బాధ్యతలను నేను, నా టీమ్‌ తీసుకుంటాం. వారిని జాగ్రత్తగా చూసుకుంటాం. రెండు సంవత్సరాల పాటు వారికి తిండి, చదువు, అవసరమైన వాటినన్నింటిని సమకూర్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా నిలబడాలి. అందరూ ఇంటి దగ్గరే ఉండి, క్షేమంగా మీ ప్రాణాలను కాపాడుకోండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు చేతనైన సాయం అందించి ఆదుకోండి.." అని సందీప్‌ కిషన్‌ తన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.



Updated Date - 2021-05-04T02:28:03+05:30 IST