ఆ పాట రాసింది అన్నమాచార్యా ? సిరివెన్నెలా?
ABN , First Publish Date - 2021-12-01T18:37:38+05:30 IST
స్వరాల హారంలో పదాల ముత్యాల్ని.. అతి లాఘవంగా పొదగడం సిరివెన్నెల సీతారామశాస్త్రికే సాధ్యం. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటల ఆణిముత్యాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆస్వాదిస్తూ ఉంటారు. దాదాపు 3000కు పైగానే పాటలు రాసి.. రాబోయే తరాలకి స్ఫూర్తినిచ్చారు సీతారామ శాస్త్రి. వేటూరి తర్వాత టాలీవుడ్ సినీ సాహిత్య సాగరాన్ని తన అద్భుతమైన పాటలతో మధించారు ఆయన.
స్వరాల హారంలో పదాల ముత్యాల్ని.. అతి లాఘవంగా పొదగడం సిరివెన్నెల సీతారామశాస్త్రికే సాధ్యం. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటల ఆణిముత్యాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆస్వాదిస్తూ ఉంటారు. దాదాపు 3000కు పైగానే పాటలు రాసి.. రాబోయే తరాలకి స్ఫూర్తినిచ్చారు సీతారామ శాస్త్రి. వేటూరి తర్వాత టాలీవుడ్ సినీ సాహిత్య సాగరాన్ని తన అద్భుతమైన పాటలతో మధించారు ఆయన. అయితే తను రాసిన ఒక పాట అన్నమాచార్య రాసిందేమో అనే అనుమానం కలిగేంతటి స్థాయిలో సాహిత్య విన్యాసం చేశారు సిరివెన్నెల. ఆ పాట ‘శ్రుతిలయలు’ చిత్రం కోసం ఆయనే స్వయంగా రాశారంటే ఇప్పటికీ నమ్మని వారున్నారు.
తెలవారదేమో స్వామీ .. నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలూ మంగకూ.. అంటూ సాగే ఆ పాట అచ్చం అన్నమాచార్య పదకూర్పులాగే అనిపిస్తుంది.
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ..
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..
ఈ పాటని పాడిన కేజే ఏసుదాసుకి, ఈ పాటని నందీ అవార్డులకోసం పంపినప్పుడు .. జ్యూరీ సభ్యులకీ కన్ఫ్యూజన్ వచ్చిందట. అయితే ఈ పాటని రాసింది సీతారామశాస్త్రే అని తెలిసిన తర్వాత ఆ సాహిత్యానికి ముగ్ధులైపోయారు. 1987లో ఈ పాటకి సీతారామ శాస్త్రి నంది అవార్డు అందుకొన్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శ్రుతిలయలు చిత్రానికి కూడా ఆ ఏడాది నంది అవార్డు దక్కడం విశేషం. ఇంకా ఎన్నో ఇలాంటి అద్భుతమైన పాటల్ని మనకి వదిలి సీతారామ శాస్త్రి తరలిరాని లోకాలకి తరలి వెళ్ళిపోవడం నిజంగా తెలుగు ప్రేక్షకుల దురదృష్టం.