‘ఎఫ్సీయూకే’ హిట్టవ్వాలి: జగ్గూభాయ్
ABN , First Publish Date - 2021-01-18T23:20:31+05:30 IST
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా.. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ చిత్రం

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా.. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ చిత్రం 'ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్'. టైటిల్లోని మరో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి సహశ్రిత నటిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. షార్ట్కట్లో ఈ సినిమా 'ఎఫ్సీయూకే'గా పాపులర్ అయ్యింది. ఇప్పటివరకూ నాలుగు ప్రధాన పాత్రలకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్తో పాటు రీసెంట్గా టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరి 12న 'ఎఫ్సీయూకే'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలిపేందుకు సోమవారం రామానాయుడు స్టూడియోస్లో చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ముందుగా సోమవారం మృతి చెందిన సుప్రసిద్ధ నిర్మాత, పంపిణీదారుడు వి. దొరస్వామిరాజుకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ.. "దొరస్వామిరాజుగారితో నేను కలిసి పనిచేశాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పోవడం ఎంతో బాధాకరం. దాము (దామోదర్ ప్రసాద్) మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. విద్యాసాగర్ రాజు కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాని చాలా బాగా తీశారు. ఈ సినిమాలో కార్తీక్ హీరో. సిన్సియారిటీతో నటించాడు. నేనొక ప్రధాన పాత్ర పోషించాను. ఈ సినిమాలో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, 'ఇది నీ కథా?' అని కొంతమంది అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూత్కు రొమాన్స్ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది. ప్రధానంగా నేను యాక్టర్ను, హీరోను కాను. ఈ సినిమా హిట్టయిందంటే నాకు పండగే. దాము నిర్మించిన 'అలా మొదలైంది' సినిమా పదేళ్లను సెలబ్రేట్ చేసుకుంటోంది. నాన్నగారు (వి.బి. రాజేంద్రప్రసాద్) నిర్మించి, దర్శకత్వం వహించిన 'దసరా బుల్లోడు' సినిమా ఈ జనవరి 13కు 50 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం హ్యాపీ. నేను యాక్టర్నయ్యాక ముప్ఫై ఐదేళ్లుగా నాకు అండగా ఉంటూ వస్తున్న మీడియాకు థాంక్స్ చెప్పుకుంటున్నాను.." అన్నారు.