థ్యాంక్స్ చెప్పడం నా బాఽధ్యత
ABN , First Publish Date - 2021-12-29T05:50:19+05:30 IST
‘‘సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అందరూ పడే కష్టం ఒకటే. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా నా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత....

‘‘సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అందరూ పడే కష్టం ఒకటే. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా నా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత. ‘పుష్ప’లాంటి మంచి చిత్రాన్ని అందించినందుకు నా టీమ్కి థ్యాంక్స్’’ అన్నారు అల్లుఅర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి వసూళ్లని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘సుకుమార్ లేకపోతే ‘ఆర్య’ లేదు. ‘ఆర్య’ లేకపోతే నేను లేను. నా కెరీర్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుకుమార్. ఈ సినిమా కోసం అడవుల్లో సైతం చెమటోడ్చారు. నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం వల్లే ‘పుష్ప’ ఇంత పెద్ద విజయాన్ని అందుకుంద’’న్నారు. సుకుమార్ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్ నా దేవుడు. చాలా గొప్ప నటుడు. తన మొహంలో అన్ని రకాల ఎమోషన్స్ పండుతాయి. ఇలాంటి నటుడు నాకు దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాలో సుకుమార్ గారు శ్రీవల్లీని ఎలా చూశారో నాకు అర్థం కావడం లేదు. ‘పుష్ప 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నా’’ అన్నారు రష్మిక. ‘‘మా సంస్థకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ఫైనల్ రన్ వరకూ దాదాపుగా రూ.325 కోట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉంద’’ని మైత్రీ మూవీస్ నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్, సుకుమార్ కన్నీరు పెట్టుకున్నారు.