చైనాలో 50 వేల ప్లస్.. ఇండియాలో కేవలం 7500.. ఎలా సరిపోతాయ్?
ABN , First Publish Date - 2021-03-19T22:48:19+05:30 IST
ఇంటికి పది పదిహేను పర్లాంగుల దూరంలోనే అన్నీ అందుబాటులో ఉన్న నేటి తరుణంలో.. థియేటర్లు మాత్రం అత్యధిక జనాభాకు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడం విచారకరం. చైనాలో 50 వేల పైచిలుకు
ప్రొడక్షన్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటి శాఖల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన నెట్5 ఓటీటీ సీఈఓ బల్వంత్ సింగ్ ఇటీవల.. థియేటర్లలో సినిమా రన్ అయిన తర్వాతే ఓటీటీలో విడుదలైతే మంచిదని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన విషయం తెలిసిందే. ఒక ఓటీటీ సంస్థకు సీఈఓ అయిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆయన అలా ఎందుకు అన్నారో.. ఈసారి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ''దేశవ్యాప్తంగా మనకు 7,500 (ఏడు వేల అయిదు వందలు) థియేటర్లు ఉన్నాయి. కానీ మన జనాభా దామాషా ప్రకారం మనకు మరో 40 వేల థియేటర్లు కావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 థియేటర్లు ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులకు సినిమాలను చేరువ చేయడానికి కనీసం మరో వెయ్యి థియేటర్లు కావాలి. కానీ ఎవరూ ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరం" అంటూ మరోసారి ఇండియన్ సినీ పరిశ్రమలోని మైనస్లను ఆయన వెలికితీసే ప్రయత్నం చేశారు. అంతేకాదు చైనాలో ఉన్నట్లు.. మన ఇండియాలో కూడా అధిక థియేటర్లు ఎందుకు ఉండాలో సాధికారికంగా వివరించారు. ఓటిటి వచ్చిన తర్వాత థియేటర్లు మూతబడడం ఖాయమేమో అన్న అనుమానాలను ఆయన నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు.
''ఎంటర్టైన్మెంట్ రంగంలో ఏదైన కొత్త ప్రక్రియ ప్రారంభం అయిన ప్రతిసారి.. ఇటువంటి అనుమానాలు తలెత్తడం సహజం. టీవీలు ఇళ్లల్లో తిష్ట వేసినప్పుడు, వీడియో పార్లర్లు వచ్చినప్పుడు, కేబుల్ టీవీ హవా నడిచినప్పుడు... ఇలా ప్రతిసారి థియేటర్లు మూతపడతాయనే అనవసర చర్చ జరుగుతూనే ఉంది. ఇంటికి పది పదిహేను పర్లాంగుల దూరంలోనే అన్నీ అందుబాటులో ఉన్న నేటి తరుణంలో.. థియేటర్లు మాత్రం అత్యధిక జనాభాకు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడం విచారకరం. చైనాలో 50 వేల పైచిలుకు థియేటర్లు ఉండడం వల్లే అక్కడ విడుదలయ్యే సినిమాలు వందల కోట్లు అవలీలగా వసూలు చేస్తున్నాయి. సినిమా విడుదలై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యాక.. చాలా దూరంలో ఉన్న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనే ఉత్సుకత ఎవరికీ ఉండదు. ఓటీటీలోనో... టీవీలోనో వచ్చినప్పుడు చూద్దామని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు" అని బల్వంత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముందుగా థియేటర్స్ లో సినిమా విడుదల చేసి.. తదుపరి ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని, కాబట్టి ఓటిటి వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే వాదన ఎంతమాత్రం పస లేనిదని ఆయన చెబుతున్నారు. బెంగుళూర్ ప్రధాన కేంద్రంగా ఓటీటీ బరిలోకి దిగిన నెట్5 సొంతం చేసుకున్న సినిమాల్లో.. ఎంపిక చేసిన సినిమాలు ముఖ్య భారతీయ భాషాలన్నింట్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని బల్వంత్ ప్రకటించారు. అందులో భాగంగా తమ నెట్5 ఓటీటీ ద్వారా ప్రసారం కావడానికి ముందే... 'లెగసి ఆఫ్ లైస్' చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
