నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ
ABN , First Publish Date - 2021-09-20T16:42:50+05:30 IST
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే అంశంపై మాట్లాడడానికి నేడు ఏపీ మంత్రి పేర్ని నాని సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే అంశంపై మాట్లాడడానికి నేడు ఏపీ మంత్రి పేర్ని నాని.. నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దిల్ రాజు, డివివి దానయ్య, రామ సత్యనారాయణ, ముత్యాల రామదాసులతో పాటు పంపిణీ దారులు, థియేటర్ యజమానులు హాజరయ్యారు. నిజానికి ఈ సమావేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో జరగాల్సి ఉంది. దానికి మెగాస్టార్ చిరంజీవి , తదితర సినీ పెద్దలు హాజరవ్వాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల .. అది సాధ్యం కాలేదు. అయితే దీనికి కొద్దిమంది పెద్దలని మాత్రమే పిలిచారని, వారితో నాని మాత్రమే కలిసి చర్చించి, ఆ తర్వాత మరోసారి సీఎంతో తామందరం కలుస్తామని, ఆ డేట్ ఇంకా తెలపలేదని చిరంజీవి తెలిపారు. సరిగ్గా ఐదురోజుల క్రితమే అమరావతిలో పేర్ని నానీ.. ఈ విషయం గురించే చర్చించారు. టిక్కెట్ అమ్మకాల్ని టాలీవుడ్ లో కొందరు పెద్దల సమ్మతంతోనే జరపాలనుకుంటున్నామని, దీని మీద దుష్ఫ్రచారాల్ని ఆపమని చెప్పారు. అతి తక్కువ మంది సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశం వల్ల ప్రయోజనం ఉంటుందా అనే అనుమానం పరిశ్రమ లో వ్యక్తం అవుతోంది.
