లాంఛనంగా ప్రారంభమైన ‘ఆదిపురుష్’
ABN , First Publish Date - 2021-02-02T13:08:48+05:30 IST
ఆదిపురుష్ సినిమా లాంఛనంగా ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రావుత్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆదిపురుష్'. పౌరాణిక గాథ రామాయణంను ఓం రావుత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. మంగళవారం ఈ సినిమా లాంఛనంగా ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రావుత్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ఆది పురుష్’ ఆరంభ్’ అంటూ టైటిల్ లోగోతో ట్వీట్ చేశాడు ఓం రావుత్.
ఇప్పటికే ‘ఆది పురుష్’ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీని ఇంటర్నేషనల్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. టీ సిరీస్ బ్యానర్ భూషణ్ కుమార్, కృషన్ కుమార్లతో పాటు ఓంరావుత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రీకరణను పూర్తి చేస్తున్నాడు. మరో వైపు 'సలార్' రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.