సీతగా కంగనా రనౌత్
ABN , First Publish Date - 2021-09-15T06:32:55+05:30 IST
‘తలైవి’ చిత్రంతో తాజా సక్సెస్ను అందుకున్న కంగనా రనౌత్ కొత్త సినిమాను ప్రకటించారు. ఈసారి ఆమె సీత పాత్రలో కనిపించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ద ఇన్కార్నేషన్-సీత’ చిత్రంలో...
‘తలైవి’ చిత్రంతో తాజా సక్సెస్ను అందుకున్న కంగనా రనౌత్ కొత్త సినిమాను ప్రకటించారు. ఈసారి ఆమె సీత పాత్రలో కనిపించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ద ఇన్కార్నేషన్ - సీత’ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషించనున్నారు. కంగనా రనౌత్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. కె.వి. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. సీత పాత్రకు తొలుత కరీనాకపూర్ను చిత్రబృందం అనుకుంది. పారితోషికం ఎక్కువగా అడగడంతో ఆమెకు బదులు కంగనను ఎంపిక చేశారని సమాచారం. ఈ చిత్రానికి సలోని శర్మ నిర్మాత. ప్రస్తుతం కంగనా రనౌత్ ‘తేజస్’, ‘ధాక్కడ్’, ‘అపరాజిత అయోధ్య’, ‘ఎమర్జెన్సీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
కోర్టుకు హాజరు కావాలి!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం తన పరువుకు భంగం కలిగించేలా కంగనా రనౌత్ ఓ టీవీ ఇంటర్య్వూలో వ్యాఖ్యలు చేశారని గతేడాది నవంబర్లో రచయిత జావేద్ అక్తర్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. దీనిని కొట్టివేయాలని ముంబై హైకోర్టులో కంగనా పిటీషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం దావా కేసు విచారణకు వచ్చినప్పుడు... కంగనా రనౌత్కి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె న్యాయవాది కోరారు. ‘తలైవి’ ప్రచార కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయడంతో ఆమెలో కొవిడ్-19 లక్షణాలు కనిపించాయని కోర్టుకు వివరించారు. దాంతో ఈ ఒక్కసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ... ఆ రోజు కంగనా రనౌత్ కోర్టుకు హాజరు కాకపోతే ఆమెపై వారెంట్ ఇష్యూ చేస్తామని న్యాయమూర్తి ఆర్ఆర్ ఖాన్ తీర్పునిచ్చారు.