అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులు..అలాంటి పనులు చేయొద్దంటున్న Salman Khan
ABN , First Publish Date - 2021-11-29T00:51:08+05:30 IST
సల్మాన్ ఖాన్ నటించిన ‘‘అంతిమ్’’ సినిమా థియేటర్లల్లో ఈ మద్యనే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. చిత్రం రిలీజ్ కాగానే భాయిజాన్ ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకింది

సల్మాన్ ఖాన్ నటించిన ‘‘అంతిమ్’’ సినిమా థియేటర్లల్లో ఈ మద్యనే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. చిత్రం రిలీజ్ కాగానే భాయిజాన్ ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. అభిమానులు హద్దులు దాటి హీరో పోస్టర్పై పాలను పోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది.
అభిమానులు ఈ విధంగా చేస్తున్న విషయం సల్మాన్ దృష్టకి వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు ఆ వీడియోను షేర్ చేస్తు పాలను వృథా చేయవద్దని కోరారు. ‘‘ చాలా ప్రాంతాల్లో అనేక మందికి నీళ్లు కూడా లభించడంలేదు. అటువంటి స్థితిలో మీరు నా పోస్టర్పై పాలు పోసి వృథా చేస్తున్నారు. అవసరమైన వారికి ఈ పాలను అందించాలని నేను కోరుతున్నాను. పాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న పేద పిల్లలకు వాటిని అందించండి ’’ అని సల్మాన్ ఖాన్ కోరారు.
అంతకు ముందు కొంత మంది అభిమానులు థియేటర్స్ లోపల క్రాకర్స్ను కాల్చారు. సినిమా హాళ్ల లోపల వాటిని కాలిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల అటువంటి పనులు చేయొద్దన్నారు. అంతిమ్ ద ఫైనల్ ట్రూత్లో సల్మాన్ ఖాన్ పోలీసాఫీసర్ పాత్రను పోషించారు. సల్మాన్ బామ్మర్ది ఆయుష్ శర్మ ఈ సినిమాలో హీరోగా నటించారు. ప్రస్తుతం సల్మాన్ టైగర్-3 షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపించనున్నాడు.