నా భర్త పోయిన తర్వాత వాళ్ల కోసమే బతికి ఉన్నా: Mandira Bedi
ABN , First Publish Date - 2021-10-18T21:23:46+05:30 IST
బాలీవుడ్ సీనియర్ నటి, ప్రెజెంటర్ మందిరా బేడీ భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ కౌశల్ ఈ ఏడాది జూన్లో కన్ను మూసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సీనియర్ నటి, ప్రెజెంటర్ మందిరా బేడీ భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ కౌశల్ ఈ ఏడాది జూన్లో కన్ను మూసిన సంగతి తెలిసిందే. భర్తను అమితంగా ప్రేమించే మందిర ఆయన అంత్యక్రియలను స్వయంగా నిర్వహించింది. మందిర, రాజ్ దంపతులకు పదేళ్ల కొడుకు ఉన్నాడు. అలాగే గతేడాది వీరు ఓ బాలికను దత్తత తీసుకున్నారు. భర్త పోయిన తర్వాత తన జీవితం గురించి మందిర తాజాగా మాట్లాడింది.
`అంత విషాదం నుంచి నేను త్వరగా తేరుకోగలగడానికి, మరింత ఉన్నతంగా పనిచేయగలగడానికి, అసలు బతికి ఉండడానికి నా పిల్లలే కారణం. వాళ్లే నా బలం, ధైర్యం. నా పయనానికి కారణం వారే. వారి కోసమైనా నేను మరింత ధైర్యంగా ముందుకెళ్లాల`ని మందిర చెప్పుకొచ్చింది. నటిగానే కాదు.. క్రికెటర్ ప్రెజంటర్గా కూడా మందిర ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. 2003, 2007 ఐసీసీ వన్డే ప్రపంచకప్లు, 2004, 2006 ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు ఐపీఎల్-2కు కూడా మందిర వ్యాఖ్యాతగా వ్యవహరించింది.