షారూఖ్ తనయుడే కాదు.. ఇప్పటిదాకా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సెలబ్రెటీల లిస్ట్ ఇదీ..!
ABN , First Publish Date - 2021-10-04T19:56:20+05:30 IST
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం రాత్రి దాడి చేశారు.
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం రాత్రి దాడి చేశారు. ఆ పార్టీలో ఉన్న ఆర్యన్తో సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్ను వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇలాంటి కేసుల్లో గతంలో కూడా కొంత మంది సినీ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. మరికొందరు విచారణకు హాజరయ్యారు. వారి జాబితాను పరిశీలిస్తే..
రియా చక్రవర్తి
ఇటీవల మరణించిన బాలీవుడ్ ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితురాలు, ప్రియురాలు అయిన రియా చక్రవర్తి గతేడాది సెప్టెంబర్లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. సుశాంత్కు రియా, ఆమె సోదరుడు షోవిక్ ఓ మధ్యవర్తి ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. దాంతో రియాను, షోవిక్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు.
దీపికా పదుకొనే
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే కూడా ఎన్సీబీ విచారణకు హాజరైంది. దీపిక, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్.. డ్రగ్ డీలర్స్తో 2017లో ఛాట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. దాంతో వారిద్దరినీ గతేడాది సెప్టెంబర్లో ఎన్సీబీ అధికారులు విచారించారు.
రకుల్ ప్రీత్
డ్రగ్స్ వివాదంలో దక్షిణాది ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా చిక్కుకుంది. రియా చక్రవర్తికి స్నేహితురాలైన రకుల్ తన నివాసంలో నిషేధిత డ్రగ్స్ను ఉంచినట్టు ఎన్సీబీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను కూడా ఎన్సీబీ అధికారులు విచారణకు పిలిచారు. దాదాపు ఒకరోజంతా ఆమెను విచారించారు. రకుల్తోపాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సైతం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు.
ఫర్దీన్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ 2001లో 9 గ్రాముల కొకైన్తో పోలీసులకు దొరికిపోయాడు. కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభించాడు. అనంతరం డిటాక్షిఫికేషన్ సెంటర్కు హాజరై డ్రగ్స్కు పూర్తిగా దూరమయ్యాడు.
మమతా కులకర్ణి
2018 జూన్లో థానే పోలీసులు 20 టన్నుల ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ డ్రగ్స్ రాకెట్తో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మమతా కులకర్ణికి సంబంధం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె విచారణకు కూడా హాజరైంది.
అర్మాన్ కోహ్లీ
`జానీ దుష్మన్`, `ప్రేమ్ రతన్ ధన్ పాయో` వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ ఈ ఏడాది ఆగస్టులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఎన్సీబీ అధికారుల అతడి ఇంటిపై రైడ్ చేసినపుడు తక్కువ స్థాయిలో డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి.
ప్రీతిక చౌహాన్
హిందీ బుల్లితెర నటి ప్రీతిక చౌహన్ 2020 అక్టోబర్లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. నిషేధిత గంజాయిని ఉపయోగిస్తున్నట్టు తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె బెయిల్ పై విడుదలైంది.
కపిల్ ఝవేరి
గతేడాది ఆగస్ట్లో గోవాలోని జరిగిన ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి జరిపారు. ఆ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు సమాచారం రావడంతో దాడి చేసిన పోలీసులు ఆ పార్టీని నిర్వహించిన నటుడు కపిల్ ఝవేరిని అరెస్ట్ చేశారు. కపిల్ డ్రగ్స్ వాడడమే కాదు.. సరఫరా చేస్తున్నడాని కూడా ఎన్సీబీ అధికారులు అనుమానించారు. అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు.
వీరు మాత్రమే కాదు.. హిందీ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలను ఎన్సీబీ అధికారులు కొద్ది రోజులుగా విచారిస్తున్నారు.