అమెజాన్ ప్రైమ్తో రూ.250కోట్ల డీల్ కుదుర్చుకున్న బాలీవుడ్ బడా నిర్మాత
ABN , First Publish Date - 2021-11-01T22:17:06+05:30 IST
కరోనాతో అనంతరం ప్రజలు ఓటీటీల బాట పట్టారు. థియేటర్ల వైపు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటీటీలకు కూడా భారీ సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ వచ్చి చేరుతున్నారు.

కరోనా అనంతరం ప్రజలు ఓటీటీల బాట పట్టారు. థియేటర్ల వైపు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటీటీలకు కూడా భారీ సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ వచ్చి చేరుతున్నారు. దీంతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా సినిమాలను కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్తో బాలీవుడ్ బడా నిర్మాత ఒకరు రూ.250కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు మీడియా కోడై కూస్తోంది.
సాజిద్ నడియడ్ వాలా నిర్మించబోయే 5 చిత్రాలను అమెజాన్ ప్రైమ్కి అమ్మేసినట్టు సమాచారం. అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే, సల్మాన్ ఖాన్ కిక్-2, టైగర్ ష్రాఫ్ హీరో పంటీ-2, కబీ ఈద్ కబీ దివాలీ, సత్యనారాయణ్న్ కీ కథ సినిమాలను ఆ ప్లాట్ ఫామ్కు అమ్మేసినట్టు తెలుస్తోంది.
థియేటర్లు, ఓటీటీల్లో ఈ సినిమాలు ఏకకాలంలో విడుదలవుతాయి. థియేటర్లల్లో విడుదల అయిన అనంతరం జీరో విండో పీరియడ్తోనే ఈ చిత్రాలు రిలీజ్ అవుతాయి. ‘‘ సాజిద్ నడియడ్ వాలా తప్పనిసరిగా సల్మాన్ ఖాన్తోనే కిక్-2 సినిమాను నిర్మిస్తారు. గత కొంతకాలంగా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను ఆయన తప్పక నిర్మిస్తారు. అందువల్లే అమెజాన్తో డీల్ కుదుర్చుకున్నప్పుడు ఆ సినిమాను కూడా చేర్చారు. ఒప్పందంలో భాగంగా కిక్ -2 మూవీకే అమెజాన్ ప్రైమ్ వారు ఎక్కువ చెల్లించారు ’’ నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఒకరు చెప్పారు.
సాజిద్ నడియడ్ వాలా తాజాగా తడప్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టాలీవుడ్లో భారీ విజయం సాధించిన Rx100కు రీమేక్. అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా నటించారు. మిలాన్ లుతారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 3న విడుదల కానుంది. ఈ సినిమా హక్కులను కూడా సాజిద్ అమెజాన్ ప్రైమ్కే ఇచ్చారు.