సుశాంత్ సింగ్ కేసు.. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-09-20T23:11:25+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన సాక్ష్యాలు ట్యాంపరింగ్ జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎయిమ్స్
![సుశాంత్ సింగ్ కేసు.. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం కీలక వ్యాఖ్యలు](https://media.chitrajyothy.com/appimg/galleries/2020092005355789/09202020174109n79.jpg)
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన సాక్ష్యాలు ట్యాంపరింగ్ జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం కీలక వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మృతదేహం నుంచి సేకరించిన అంతర అవయవాలను సరిగా భద్రపరచలేదని, నిర్లక్ష్యం జరిగినట్టు కనిపిస్తోందని పేర్కొంది. తాము స్వాధీనం చేసుకున్న సుశాంత్ అంతర అవయాలు కొద్ది మొత్తంలోనే ఉన్నాయని, అవి కూడా బాగా పాడైపోయాయని ఎయిమ్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ పేర్కొన్నట్టు ‘ఐఏఎన్ఎస్’ తెలిపింది.
కాగా, నేడు సీబీఐ సిట్ బృందాన్ని కలుసుకోనున్న ఎయిమ్స్ బృందం తాము కనుగొన్న అంశాలకు సంబంధించిన నివేదికను అందించనుంది. నిన్న సాయంత్రం వరకు సుశాంత్ అంతర అవయవాలను ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం పరీక్షించింది. అవి పూర్తిగా పాడయ్యాయని, రసాయన, టాక్సికాలాజికల్ విశ్లేషణ నిజంగా కష్టంగా మారిందని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఎయిమ్స్ చెప్పినట్టు అదే జరిగి ఉంటే అది మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులకు పెద్ద ఎదురుదెబ్బే కానుంది. సుశాంత్ మరణం తర్వాతి రోజు రాష్ట్ర హోం మంత్రి మాట్లాడుతూ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టం చేశారు. హత్య కోణం నుంచి దర్యాప్తు చేపట్టలేదని పేర్కొన్నారు.