‘ఒరేయ్.. బుజ్జిగా’ రివ్యూ
ABN, First Publish Date - 2020-10-02T03:43:14+05:30
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్ ... బుజ్జిగా’. అక్టోబర్ 1న ఆహాలో విడుదలైంది.
బ్యానర్: శ్రీసత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
నటీనటులు: రాజ్తరుణ్, మాళవికా నాయర్, హెబ్బాపటేల్, పోసాని కృష్ణమురళి, సీనియర్ నరేశ్, వాణీ విశ్వనాథ్, మదునందన్, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, సత్య, అన్నపూర్ణ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: ఆండ్రూ
మాటలు: నంద్యాల రవి
ఆర్ట్: టి.రాజ్కుమార్
ఫైట్స్: రియల్ సతీశ్
నిర్మాత: కె.కె.రాధామోహన్
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొండా విజయ్కుమార్
రాజ్తరుణ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవి ‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ, ఈడోరకంఆడోరకం, కుమారి 21 ఎఫ్’ సినిమాలే. తర్వాత రాజ్తరుణ్ చేసిన సినిమాలేవీ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయితే నటుడిగా మంచి హిట్ కోసం ఈ యువ హీరో ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో పక్క గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు కొండా విజయ్ కుమార్కు ఆ తర్వాత ఆశించిన స్థాయి సక్సెస్ లేదు. ఈయన కూడా డైరెక్టర్గా మంచి బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇలా సక్సెస్ కోసం ఎదురుచూసిన రాజ్తరుణ్, కొండా విజయ్కుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. చిత్ర దర్శకుడు కొండా విజయ్ కుమార్ చేసిన రెండు సినిమాలు లవ్స్టోరిసే. ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రేమకథా చిత్రమే అయినా, కామెడీపై కూడా ఫోకస్ చేసినట్లు సినిమా టీజర్, ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో మేకర్స్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో విడుదల చేశారు. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
నిడదవోలులోని కోటేశ్వరరావు(పోసాని కృష్ణమురళి) కాంట్రాక్టర్. అతని కొడుకు శ్రీనివాస్(రాజ్తరుణ్). తల్లి చనిపోవడంతో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం కొడుకు శ్రీనివాస్కు పెళ్లి చేయాలని అనుకుంటాడు కోటేశ్వరరావు. కానీ పెళ్లి చేసుకోవడం నచ్చకుండా శ్రీనివాస్ ఊరు వదలి వెళ్లిపోవడానికి ట్రెయిన్ ఎక్కుతాడు. అదే సమయంలో అదే ఊరిలో ఉండే చీఫ్ ఇంజనీర్ చాముండేశ్వరి(వాణీవిశ్వనాథ్) కూతురు కృష్ణవేణి(మాళవికా నాయర్) పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఊరు విడిచి వెళ్లిపోతుంది. ఇద్దరూ ఒకే ట్రెయిన్ ఎక్కుతారు. దాంతో శ్రీనివాస్ అలియాస్ బుజ్జిగాడు, కృష్ణవేణి లేచిపోయారనే పుకార్లు మొదలవుతాయి. కానీ ట్రెయిన్లో శ్రీనివాస్, కృష్ణవేణి మంచి స్నేహితులు అవుతారు. శ్రీనివాస్ ముద్దు పేరు బుజ్జిగాడు అని తెలియదు. తను ట్రెయిన్ ఎక్కే సమయంలో తను ట్రెయిన్ ఎక్కడం వల్ల బుజ్జిగాడుతో కృష్ణవేణి లేచిపోయిందనే పుకారు మొదలైందనే విషయం కృష్ణవేణికి తెలుస్తుంది. దాంతో ఆమె బుజ్జిగాడు మీద పీకలదాకా కోపం పెంచుకుంటుంది. మరోవైపు కృష్ణవేణి కారణంగా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయని తెలుసుకున్న బుజ్జిగాడు. ఆమెను వెతికి పట్టుకొస్తానని అమ్మకు ప్రామిస్ చేస్తాడు. కృష్ణవేణి కూడా స్వాతి అని పేరు మార్చి చెప్పడంతో, బుజ్జిగాడు కూడా కృష్ణవేణినే తను వెతుకుతున్న స్వాతి అని తెలియక ఆమెతో స్నేహం చేస్తాడు. అసలు శ్రీనివాస్, కృష్ణవేణి వేర్వేరు కారణాలతో ట్రెయిన్ ఎక్కారనే నిజం తెలియక కుటుంబ సభ్యులు గొడవలు పడుతుంటారు. తాను ప్రేమించిన సృజన(హెబ్బాపటేల్) మోసం చేసి పోవడంతో బుజ్జిమళ్లీ తిరిగి ఊరికి వెళ్లలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. శ్రీనివాస్, కృష్ణవేణి ప్రేమలో పడతారు. ఒకరంటే ఒకరికి తెలియకుండా ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్స్ ఎలా క్లియర్ అవుతాయి. బుజ్జి, కృష్ణవేణి కలుస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ లవ్ అనే ఎమోషన్ను బేస్ చేసుకునే తొలి చిత్రంతో సూపర్డూపర్హిట్ కొట్టాడు. రెండో చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేదు. మరి మూడో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? అంటే సినిమా చూసిన ప్రేక్షకుడు ప్చ్ అనడం తప్ప.. ఏం చేయలేడు. ఎందుకనే వివరాల్లోకెళ్తే.. సినిమా అంతా ఒక అబ్బాయి, అమ్మాయి వారి పర్సనల్ రీజన్స్తో ఊరు వదిలి పారిపోతారు. దాంతో వారు లేచిపోయారనే రూమర్తో సినిమా ప్రారంభం అవుతుంది. కానీ ఒకే ఊర్లో ఒకరికొకరు తెలియకుండా యుక్తవయసులో అబ్బాయి, అమ్మాయి ఉంటారా? సరే! తెలియదనే అనుకుంటాం. రూమర్స్ వల్ల ఇద్దరు కుటుంబాల్లో గొడవలు జరిగినప్పుడు హీరో అమ్మాయిని వెతికి పట్టుకుంటానంటాడు. అలాంటప్పుడు హీరో, హీరోయిన్ ఫొటోను వాట్సప్లో తెప్పించుకోవచ్చు. కానీ అదేమీ చేయకుండా ఫేస్బుక్పై ఆధారపడటం అనేది లాజిక్కి అందలేదు. ఇక హీరోయిన్ తల్లి పెద్ద ఆఫీసర్.. హీరోను తన మనుషులతో వెతికించే క్రమంలో అతని ఫోన్ నెంబర్తో ట్రేస్ చేయవచ్చు. కానీ అలాంటిదేమీ జరగలేదు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో దర్శకుడు ఈ విషయాల గురించి పట్టించుకోలేదు. ఇక లవ్ దానికి అతికించబడ్డ కామెడీ ప్రేక్షకుడిని మెప్పించలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్లో ఫస్టాఫ్ పూర్తికాగానే స్టోరి ఇదే అని ప్రేక్షకుడు ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. సినిమా కూడా అలాగే నడిచింది. ఎలాంటి ట్విస్టులు, టర్న్లు లేవు. ఇలాంటి పాయింట్స్తో సినిమాలను ప్రేక్షకుడు ఆధారించాలంటే ఎమోషన్స్ బలంగా ఉండాలి. అవేవీ ఈ సినిమాలో కనపించలేదు. రాజ్తరుణ్కు మరోసారి అదృష్టం కలిసి రాలేదు. అయితే రాజ్తరుణ్ గత చిత్రాల కంటే ఈ సినిమాలో కాస్త యాక్షన్ డోస్ పెరిగిందనాలి. కొండా విజయ్కుమార్ ఎప్పటి కథనో స్క్రీన్పై చూపిస్తూ కామెడీకి ఆడియెన్ కనెక్ట్ అవుతాడని అనుకుని రెండొందల శాతం తప్పుచేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా వీక్ స్క్రీన్ప్లే. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మాళవికా నాయర్, హెబ్బా పటేల్ ఇద్దరూ ఇద్దరే. యూత్ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా లవ్ట్రాక్ లేదు. ఇక పోసాని, వాణీవిశ్వనాథ్, అజయ్ ఘోష్, నరేశ్, మధునందన్, సప్తగిరి, సత్య అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. అయితే నటీనటులను డైరెక్టర్ సరిగ్గా వినియోగించుకున్నట్లు అనిపించలేదు. హీరో, అతని ఫ్రెండ్ వారి ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్లో మోసం చేసే సన్నివేశాన్ని చాలా సినిమాల్లో చూశాం. దాన్నే విజయ్ కుమార్ కొండా మళ్లీ ఈ సినిమాలో ట్రై చేశాడు. ఈ సీన్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. అనూప్ సంగీతం అందించిన సినిమాలోని పాటల్లో ‘ఈమాయ పేరేమిటో...’ అనే మాంటేజ్ సాంగ్ బావుంది. కాన్సెప్ట్ ప్రకారం ఇలాంటి సాంగ్స్ను ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూసేశారు ప్రేక్షకులు. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేదు. ఇక అండ్రూ కెమెరా పనితనం ఓకే. లొకేషన్స్ పరంగా పెద్దగా ఇక్కడిక్కడే సినిమాను చుట్టేశారు. సినిమాను ఏదో తప్పక చూడాలనుకుంటే తప్ప చూసేంత సినిమా అయితే కచ్చితంగా కాదు.
బోటమ్ లైన్: ఒరేయ్...బుజ్జిగా అని అరవాలంతే(కోపంగా)
రేటింగ్: 2/5
Updated Date - 2020-10-02T03:43:14+05:30 IST