‘నిశ్శబ్దం’ రివ్యూ
ABN , First Publish Date - 2020-10-02T13:12:08+05:30 IST
అనుష్క, మాధవన్, షాలిని పాండే, అంజలి, అండ్రూ మ్యాడ్సేన్ తదితరులు నటీనటులుగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది.
చిత్రం: నిశ్శబ్దం
విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేది: అక్టోబర్ 2
బ్యానర్స్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలినిపాండే, సుబ్బరాజ్, మైకేల్ మ్యాడ్సేన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
బ్యాక్గ్రౌండ్ స్కోర్: గిరీష్.జి
సినిమాటోగ్రఫీ: షానియల్ డియో
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రీన్ప్లే, డైలాగ్స్: కోనవెంకట్
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
టాలీవుడ్లో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. భాగమతి తర్వాత ఈమె నటించిన మరో చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్రాస్ జోనర్ మూవీ. కోవిడ్ ప్రభావంతో థియేటర్స్లో విడుదల కాకుండా సినిమా చాలా రోజుల వరకు ఆగింది. థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయంలో ఓ క్లారిటీ రాకపోవడంతో మేకర్స్ సినిమాను అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. తెలుగులో నిశ్శబ్దం, తమిళ, మలయాళంలో సైలెన్స్ పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో నటించింది. అసలు అనుష్క మరోసారి తన మార్కు నటనతో ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అసలు నిశ్శబ్దం అనే టైటిల్ వెనుక అర్థమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
1972లో యు.ఎస్లోని సీటెల్ ప్రాంతానికి 70 కి.మీ దూరంలోని వుడ్ హౌస్లో ఉండే భార్యాభర్తలు పీటర్, మెలిసాలను ఎవరో చంపేస్తారు. ఆ వుడ్ హౌస్ ఓనర్ జోసెస్ ఆత్మే వారిని హత్య చేసి ఉంటుందని అందరూ భావించారు. కేసును పోలీసులు ఛేదించలేక మిస్టరీ కేసుగా వదిలేస్తారు. తర్వాత ఆ విల్లాను అందరూ హాంటెడ్ హౌస్గా భావిస్తారు. దాంతో ఆ విల్లాను ఎవరు కొనరు. 2019లో కొలంబియాకు చెందిన బిజినెస్మేన్ మార్టిన్ ఎస్కవాడో ఆ విల్లాను ధైర్యం చేసి కొంటాడు. కానీ ఆ ఇంట్లో ఉండటానికి అందరూ భయపడుతుంటారు. ఎవరూ రారు. చాలా ఏళ్ల తర్వాత అంటే..2019లో ఆ విల్లాలోకి సాక్షి(అనుష్క), ఆంటోని(మాధవన్) వస్తారు. అప్పటికే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యుంటుంది. ఆ విల్లా ఓనర్ జోసెఫ్ వేసిన ఓ పెయింటింగ్ వేయాలని సాక్షి అనుకోవడంతో సాక్షి, ఆంటోనీ అక్కడికి వస్తారు. అయితే ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన కొద్దిసేపటికి అండర్ గ్రౌండ్ రూమ్లోకి వెళ్లిన ఆంటోనీపై ఎటాక్ జరుగుతుంది, అతను చనిపోతాడు. సాక్షి తప్పించుకుని గాయాలతో బయటపడుతుంది. పోలీస్ కెప్టెన్ రిచర్డ్ (మైకేల్ మ్యాడ్సన్), డిటెక్టివ్ మహాలక్ష్మి(అంజలి) కేసును టేకప్ చేస్తారు. అప్పటికే సీయటెల్లో చాలా మంది అమ్మాయిలు కనపడకుండా పోతారు. దాంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుంటారు. అప్పటికే ఓ మోడల్ను పెళ్లి చేసుకున్న ఆంటోనీ.. సాక్షికి ఎలా పరిచయం అవుతాడు? సాక్షి ప్రాణ స్నేహితురాలు సోనాలి(షాలిని పాండే) ఏమైంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తారు. డిటెక్టివ్ మహాలక్ష్మికి ఓ ఆలోచన వస్తుంది. దాంతో ఆమె సోనాలి కోణంలో మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తూ వస్తుంది. అప్పుడెమవుతుంది. సోనాలి ఎవరు? నిజంగానే మిస్సయ్యిందా? సీయటెల్లో కనిపించకుండా పోయిన అమ్మాయిలందరూ ఎవరు? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా అంతా అమెరికా నేపథ్యంలో సాగుతుంది. సీయటెల్ పట్టణంలో కనిపించకుండా పోయిన అమ్మాయిలు, హాంటెడ్ హౌస్లో జరిగిన రెండు హత్యలకు లింకు పెడుతూ సినిమా ప్రారంభమవుతుంది. అలాగే డిటెక్టివ్ మహాలక్ష్మి అసలేం జరిగిందో చెబుతూ వస్తుంది. తాను ఎదుర్కొన్న విచిత్రమైన కేసును గురించి వివరిస్తూ వస్తుంది. దర్శకుడు హేమంత్ మధుకర్, స్క్రీన్ప్లే రైటర్ కోన వెంకట్ సినిమాను అలా ముందుకు నడపడంతో కాస్త ఓకే అనిపిస్తుంది. ఇక అనుష్క, మాధవన్ ఇంట్లోకి వెళ్లడం అక్కడ నెమ్మదిగా సాగే సన్నివేశాలు. ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందన్నట్లు చూపించే సన్నివేశాలతో సినిమా కొన్ని నిమిషాలు. మాధవన్ చనిపోవడంతో..ఏం జరిగింది తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. అనుష్క దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) సాక్షి పాత్రలో చాలా చక్కగా నటించింది. పాత్ర పరంగా మాటలు రాకుండా హావభావాల పరంగా నటించడానికి ఆమె చాలా వర్కవుట్ చేసినట్లు స్పషంగా కనిపిస్తుంది. అనుష్క చేసిన ఈ డిఫరెంట్ ప్రయత్నానికి ఆమెను అభినందించాలి. ఇక ఫస్టాఫ్లో మాధవన్ పాత్ర పెద్ద ఎఫెక్టివ్గా అనిపించదు కానీ సెకండాఫ్ అంతా అతని పాత్రను బేస్ చేసుకునే రన్ అవుతుంది. అలాగే హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సేన్ కూడా చాలా మంచి పాత్రలో నటించాడు. డిటెక్టివ్ పాత్రలో అంజలి న్యాయం చేసింది. షాలిని పాండే, సుబ్బరాజ్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత సెకండాఫ్లోనే. కానీ వారికి చాలా మంచి పాత్రలు దొరికాయనే చెప్పాలి. ఇక అవసరాల శ్రీనివాస్ పెద్దగా అవసరం లేని పాత్రలోనే కనిపించాడు. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో నటించారు.
సాంకేతికంగా చూస్తే పాత హాలీవుడ్ సినిమాలో ఇంట్లో అర్థరాత్రి దెయ్యం ఏం చేసిందనే స్టైల్లో ఓ సీన్తో సినిమాను స్టార్ట్ చేశారు. సన్నివేశంలో ఏం జరుగుతుందనే విషయం ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అక్కడ ఎలాంటి సస్పెన్స్ ఉండదు. నెమ్మదిగా సాగే సన్నివేశాలు, ఇంట్లో ఏదో ఉందనే చెప్పే ప్రయత్నాలు చూపించారు. కానీ అదేదో చివరి వరకు చూపించరు. హాంటెడ్ హౌస్ అని ఓ విల్లాకు పేరు పెట్టడం కోసం ఆ సన్నివేశం చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. ఇక సినిమా అంతా మాధవన్ పాత్ర ఎలా చనిపోయింది, సాక్షి ఏదో దాస్తుందనే కోణంలో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక సెకండాఫ్లో షాలిని పాండే, మాధవన్, సుబ్బరాజ్, అనుష్క, మైకేల్ పాత్రలు చుట్టూల కథ రన్ అవుతుంది. సినిమా సెకండాఫ్ ద్వితీయార్థంలో సుబ్బరాజ్ కోణంలో అసలేం జరిగిందనేది చెబుతూ సినిమాలో ట్విస్ట్ను రివీల్ చేస్తారు. సినిమా ఇరవై నిమిషాల ముందే ట్విస్ట్ విడిపోవడంతో కిక్ పోతుంది. మిగతా కథంతా కామన్గానే సాగుతుంది.
అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలతో సినిమాను అక్కడే చేశామనే పాయింట్ తప్పితే నిశ్శబ్దం సినిమాను అమెరికాలో ఎందుకు చిత్రీకరించారో అర్థం లేదనిపిస్తుంది. అనుష్క పాత్రలో బలమైన ఎమోషన్స్ను చక్కగా ఎలివేట్ చేయలేదు. ఆమె పడ్డ కష్టానికి పాత్రను మలిచిన తీరు చూస్తే తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. గోపీసుందర్ సంగీతం, గిరీశ్ నేపథ్య సంగీతం, షానియల్ డియో కెమెరా పనితనం ఓకే. భాగమతి చిత్రంలో అనుష్క పాత్రను, కథను ఎలా డిజైన్ చేశారో ఈ సినిమాలో అలాంటి స్టైలే కనిపిస్తుంది. ఆ సినిమాలో అనుష్క పాత్ర మాట్లాడుతుంది. ఈ సినిమాలో మాట్లాడదు. కానీ రివేంజ్ ఫార్ములాలో సాగే సినిమా ఇది. థ్రిల్లర్ సినిమాలు, అనుష్క అభిమానులు చూడాలనుకుంటే చూడొచ్చు..
చివరగా... ‘నిశ్శబ్దం’... జస్ట్ ఓకే
రేటింగ్: 2.5/5