వెబ్ సిరీస్గా రాబోతోన్న ‘మేకసూరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2020-07-19T21:15:49+05:30 IST
‘జీ 5’ ఓటీటీలో వచ్చిన ఒరిజినల్ తెలుగు సిరీస్ ‘గాడ్’ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి) వీక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వెబ్ కంటెంట్ విషయంలో కొత్త ఒరవడి
![వెబ్ సిరీస్గా రాబోతోన్న ‘మేకసూరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..](https://media.chitrajyothy.com/appimg/galleries/2020071903413362/07192020154424n50.jpg)
‘జీ 5’ ఓటీటీలో వచ్చిన ఒరిజినల్ తెలుగు సిరీస్ ‘గాడ్’ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి) వీక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వెబ్ కంటెంట్ విషయంలో కొత్త ఒరవడి సృష్టించింది. ఇదొక్కటే కాదు... ఇటువంటి జానర్లోనే ‘జీ 5’లో వచ్చిన ఒరిజినల్ తమిళ్ సిరీస్ ‘ఆటో శంకర్’ కూడా ఆడియన్స్ అప్లాజ్ అందుకుంది. తెలుగు ప్రజల అభిరుచికి అనుగుణంగా మంచి సిరీస్లు అందించే ఓటీటీ వేదికగా ‘జీ 5’ ప్రశంసలు పొందుతోంది. అచ్చమైన తెలుగు సిరీస్లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్తో వీక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ నెలాఖరున మరో కొత్త సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ‘జీ 5’ సిద్ధమైంది.
రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన ‘రోబో’ సినిమాను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు శంకర్ దర్శకత్వం వహించిన ‘నన్బన్/స్నేహితుడు’ సినిమాతో అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సిరీస్ ‘మేక సూరి’. దీంతో ఓటీటీ ప్రపంచంలోకి కార్తీక్ కంచెర్ల అడుగు పెడుతున్నారు. థియేటర్ ఆర్టిస్టులు సుమయ, అభినయ్ను నటీనటులుగా పరిచయం చేస్తూ... ఆయన నిర్మిస్తున్న ‘మేక సూరి’తో ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘ఒక్క క్షణం’ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాకి అసిస్టెంట్ రైటర్గా పని చేసిన త్రినాధ్ వెలిసెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సిరీస్. ఫస్ట్ పార్ట్ ఈ నెల 31న ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు ‘మేక’ అయిపోయింది. అతడి ఊరిలో రాణి అని అందమైన అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరిలో మూతి మీద మీసం వచ్చిన కుర్రాడి నుంచి మీసాలకు రంగు వేసుకునే ముసలోళ్ల వరకూ అందరి కన్ను రాణి మీదే! మగజాతి మనసు దోచిన రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది ఎవరు? అందుకు కారణమైన వ్యక్తులపై సూరి ఎలా పగతీర్చుకున్నాడనేది జూలై 31 నుంచి ‘జీ 5’లో ప్రసారమయ్యే ‘మేక సూరి’ చూడాల్సిందే. క్రైమ్ జానర్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఇది. జూలై 31న ‘జీ 5’లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. దీనికి పార్ధు సైనా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఇంతకు ముందు కన్నడలో ‘సరోజ’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు.
![](https://media.chitrajyothy.com/appimg/galleries/2020071903413362/07192020154540n55.jpg)