నంది అవార్డు కోసమే ఈ సినిమా తీశా: నిర్మాత
ABN, First Publish Date - 2021-01-01T00:14:31+05:30
నంది అవార్డు కోసమే ఈ సినిమా తీశాము. వందకు పైగా సినిమాలు తీసినా కలగని సంతృప్తి 'జాతీయ రహదారి' ఇచ్చింది. నిర్మాతగా నేను గర్వపడే చిత్రాల్లో
అవార్డ్ విన్నింగ్ దర్శకుడు నరసింహనంది దర్శకత్వంలో.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం 'జాతీయ రహదారి'. ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ను స్టార్ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి తదితరులు ఈ చిత్రంలో నటించారు. టీజర్ విడుదల అనంతరం రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''నరసింహనంది నాకు చాలాకాలంగా తెలుసు. మాదగ్గర చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని డెడికేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అతని దర్శకత్వంలో రూపొందిన అన్ని సినిమాలు అనేక అవార్డులు గెలుచుకున్నాయి. 'జాతీయ రహదారి'కి కూడా గ్యారంటీగా నంది అవార్డ్ వస్తుంది. ఈ సినిమాకు అవార్డులతో పాటు రివార్డులు కూడా రావాలని, వాటికి ఇది జాతీయ రహదారి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''శతాధిక చిత్ర నిర్మాతగా పేరున్నా.. అది తృప్తిని కలిగించలేదు. నరసింహనంది నాకు కథ చెప్పడంతో నాకు ఈ కథ డిఫరెంట్ గా అనిపించింది. అప్పుడు నాకు నరసింహనందితో తీసే ఈ జాతీయ రహదారి సినిమాతో నంది అవార్డు తీసుకుంటాననే నమ్మకం కలిగింది. నరసింహనందిలో ఉండే తపన చూసి అతనికి నచ్చిన కథ, అతనికి సంబంధించిన జోనర్లో ఈ కథను ఎన్నుకోవడం జరిగింది. నంది అవార్డు కోసమే ఈ సినిమా తీశాము. వందకు పైగా సినిమాలు తీసినా కలగని సంతృప్తి 'జాతీయ రహదారి' ఇచ్చింది. నిర్మాతగా నేను గర్వపడే చిత్రాల్లో 'జాతీయ రహదారి' ఒకటిగా నిలుస్తుంది. విజయేంద్రప్రసాద్ గారి నోటి చలవ వల్ల ఈ చిత్రంతో నేను నంది, సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం" అని అంటే.. ''రామసత్యనారాయణకు ఎన్ని సినిమాలు తీసినా తృప్తిలేదు, కానీ నరసింహ నంది తీసే సినిమాలకు మాత్రం కచ్చితంగా అవార్డ్ వస్తుందని ఏంతో ఆశతో ఉన్నారు. ఈ సినిమా మొత్తం మా స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది. నేను ఈ సినిమా చూడడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అవార్డులతోపాటు.. జాతీయస్థాయిలోనూ అవార్డ్స్ వచ్చే కంటెంట్ ఉంది" అని అన్నారు సంధ్య స్టూడియోస్ అధినేత రవి.
దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ.. ''ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను. అందులో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకోవడం జరిగింది. 2021లో మేము నంది అవార్డ్ తీసుకొనేలా కథ రాసుకున్నాము. రామసత్యనారాయణ గారికి ఈ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ కథను నీకు నచ్చిన పద్దతిలో తీయమని చెప్పడం జరిగింది. ఒక దర్శకుడినే కాకుండా,నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేయడం వల్ల ఈ సినిమాను ఇంకొంచెం శ్రద్ధగా తీయడం జరిగింది. ప్రతి సినిమాకు నిర్మాత ఇన్వాల్ మెంట్ ఉంటుంది. కానీ ఇందులో తాను ఏ విదమైన ఇన్వాల్వ్ కాకుండా.. ఈ సినిమా విజయం సాధిస్తే.. తనకు విజయం వస్తుందనే ధ్యేయంతో నన్ను నమ్మి ఈ చిత్రం అప్పజెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చింది. నాకెంతో ఇష్టమైన విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంచి అవకాశం లభించిన నాకు ఈ 2021 సంవత్సరం మా ప్రయాణం విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నాను. సత్యనారాయణగారితో మరో సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకుంటున్నాను.." అని తెలిపారు.