బాంబు పేలలేదు
ABN , First Publish Date - 2020-10-30T07:23:52+05:30 IST
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్కుమార్, కియారా అడ్వాణీ జంటగా నటించిన ‘లక్ష్మీబాంబ్’ చిత్రం టైటిల్ మారింది....
![బాంబు పేలలేదు](https://media.chitrajyothy.com/appimg/galleries/202010300130164/10302020015345n89.jpg)
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్కుమార్, కియారా అడ్వాణీ జంటగా నటించిన ‘లక్ష్మీబాంబ్’ చిత్రం టైటిల్ మారింది. ఈ చిత్రానికి ‘లక్ష్మి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అక్షయ్కుమార్, కియారా అడ్వాణీ సోషల్ మీడియాలో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ‘లక్ష్మీబాంబ్’ టైటిల్పై హిందూ సంఘాలు, రాజ్పుత్లకు చెందిన కర్ణిసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టడం అంటే హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని కించపరచడమేనని ఆ సంఘాలు ఆరోపించాయి. అవసరమైతే సినిమా విడుదలను అడ్డుకోవడానికి న్యాయపోరాటానికైనా సిద్ధమని ప్రకటించాయి. దానికి తోడు ‘లక్ష్మీబాంబ్’ టైటిల్పై సోషల్ మీడియాలోనూ నెటిజన్ల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు రావడంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు. ‘లక్ష్మీబాంబ్’ టైటిల్ను తొలగించి కొత్తగా ‘లక్ష్మి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ముందు ప్రకటించిన విధంగానే ఈ చిత్రం డి స్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో నవంబర్ 9న దీపావళి సందర్భంగా విడుదలవుతుంది.