ఆలయాలన్నీ ఎందుకు మూతపడ్డాయో తెలుసా?: ‘బాహుబలి’ నిర్మాత
ABN, First Publish Date - 2020-03-23T23:41:31+05:30
కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఎక్కడికక్కడ దేశాలు, రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే జనజీవనం స్థంబించింది. ముందు ముందు
కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఎక్కడికక్కడ దేశాలు, రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే జనజీవనం స్థంబించింది. ముందు ముందు ఈ పరిస్థితి ఏ స్థాయికి మారుతుందో కూడా ఊహించలేనంతగా కరోనా కలకలం సృష్టిస్తుంది. అయితే ఏదైనా ఆపద వస్తే అందరూ దేవుడిని వేడుకుంటారు. ఈ సమస్య నుంచి ఎలాగైనా గట్టెక్కించు స్వామీ అని అంతా వేడుకుంటారు. అలాంటిది ఇప్పుడు దేవాలయాలు కూడా మూతబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి టైమ్లో దేవాలయాలు మూతపడటంపై కొందరు ఆకతాయిలు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడైనా అర్థమైందా దేవుడు లేడని అంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వారికి చెంపపెట్టులాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు సృష్టించారో కానీ ఓ మెసేజ్ మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అదేమిటంటే.. ‘‘దేశంలోని ఆలయాలన్నీ ఎందుకు మూతపడ్డాయో తెలుసా? దేవుళ్ళంతా ఆసుపత్రుల్లో తెల్ల కోటు వేసుకుని తమ విధులు నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. అందుకనే..’’.
ఇప్పుడీ మెసేజ్ను బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ‘‘నేను సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఒక గొప్ప మెసేజ్ను చదివాను..’’ అంటూ పై మెసేజ్ను పోస్ట్ చేశారు. ‘‘కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా ముందు నిలబడి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. ధన్యవాదాలు..’’ అని శోభు యార్లగడ్డ తన ట్వీట్లో తెలిపారు.