సినిమానే గెలిచింది: సాయితేజ్
ABN , First Publish Date - 2020-12-30T01:54:37+05:30 IST
'సోలో బ్రతుకే సో బెటర్' థాంక్స్ మీట్లో భాగంగా సాయితేజ్ మాట్లాడుతూ...

"'సోలో బ్రతుకు సోబెటర్' సినిమాను మే 1న విడుదల చేయాలని ముందుగా అనుకున్నాం. అప్పటికీ రెండు పాత్రల చిత్రీకరణ మాత్రమే మిగిలింది. ఆ సమయంలో కోవిడ్ ప్రభావం స్టార్ట్ కావడంతో సినిమా షూటింగ్, విడుదలపై అయోమయ పరిస్థితి నెలకొంది'' అన్నారు సాయితేజ్. 'సోలో బ్రతుకే సో బెటర్' థాంక్స్ మీట్లో భాగంగా సాయితేజ్ మాట్లాడుతూ "కోవిడ్ సమయంలో ప్రజలు అందరూ ఓటీటీలకు, టీవీలకు అలవాటు పడిపోతారా? అని మేం ఆలోచనలో పడిపోయాం. అదే సమయంలో మా సినిమాకు జీ స్టూడియోవారి నుండి ఓటీటీ రిలీజ్ ఆఫర్ వచ్చింది. వాళ్లకి సినిమాను ఇవ్వాలా వద్దా అని అనుకున్నాం. అయితే చివరకు ప్రొడ్యూసర్గారికి లాభాలు కావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే సినిమాను థియేటర్స్లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. ఓ ఆర్టిస్ట్కైనా, నిర్మాతకైనా, దర్శకుడికైనా థియేటర్ ఇచ్చే ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ తన పేరుని స్క్రీన్పై చూసుకుంటే ఉండే ఆనందం అంతా ఇంతా కాదు.. అలాంటి సమయంలో థియేటర్స్ను ఓపెన్ చేసుకోవచ్చునని రెండు తెలుగు ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చారు. జీ స్టూడియో వాళ్లు కూడా సినిమాను చూసి దీన్ని థియేటర్స్లో విడుదల చేస్తే బావుంటుందని సపోర్ట్ చేశారు. సినిమా విడుదల చేసే సమయంలో రకరకాల సమస్యలను ఫేస్ చేశాం. అయితే చివరకు సినిమా రిలీజైంది.. సినిమానే గెలిచింది. యువీ వంశీగారు, దిల్రాజుగారి హెల్ప్తో సినిమాను థియేటర్స్లోకి తీసుకురాగలిగాం. అలాగే సినిమా రిలీజ్ సమయంలో ఇండస్ట్రీలోని ప్రతి ఒక ఆర్టిస్ట్ ఫోన్స్ చేసి అభినందించారు. ట్వీట్స్ చేశారు. ఇలాంటి ఓ ఇండస్ట్రీలో నేను భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. మా సినిమాకు సపోర్ట్ చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మా యూనిట్ తరపున ధన్యవాదాలు చెబుతున్నాం. ప్రేక్షకులు వస్తారో, రారోనని టెన్షన్ పడుతూ ఉన్నాను. కానీ.. థియేటర్కు ప్రేక్షకులు వచ్చి మా సినిమాను ఆశీర్వదించారు.. అందరికీ థాంక్స్" అన్నారు.