బుల్లితెరపై ‘సరిలేరు నీకెవ్వరు’ సంచలన రికార్డ్
ABN , First Publish Date - 2020-04-02T21:03:39+05:30 IST
కరోనా మహమ్మారితో థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. ప్రేక్షకుడికి వినోదం ఇప్పుడు ఇంట్లో ఉండే టెలివిజన్ మాత్రమే. కాగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా
![బుల్లితెరపై ‘సరిలేరు నీకెవ్వరు’ సంచలన రికార్డ్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020040203304184/04022020153334n82.jpg)
కరోనా మహమ్మారితో థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. ప్రేక్షకుడికి వినోదం ఇప్పుడు ఇంట్లో ఉండే టెలివిజన్ మాత్రమే. కాగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన టెలివిజన్ ప్రీమియర్గా మార్చి 25న జెమినీ టీవీలో టెలికాస్ట్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్తో ఈ చిత్రం అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ను నమోదు చేసింది. బుల్లితెరపై ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్ను కూడా ఈ చిత్రం బీట్ చేయడం విశేషం.
ఉగాది రోజు ప్రసారమైన ఈ చిత్రానికి 23.4 టీఆర్పీ వచ్చినట్లుగా సదరు ఛానెల్ ప్రకటించింది. అంతకు ముందు ‘బాహుబలి’ పేరిట ఉన్న 22.7 టీఆర్పీ రేటింగ్ను ఈ చిత్రం అధిగమించి టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత స్థానంలో మళ్లీ మహేష్ బాబు మూవీనే ఉండటం మరో విశేషం. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం 22.54 టీఆర్పీని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా చూస్తే కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనం.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని బుల్లితెరపై కూడా విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది మాత్రం నిజం.