రివ్యూస్ దెబ్బకి ఇదే థియేటర్ రిలీజ్ అయితే.. : రఘు కుంచె
ABN , First Publish Date - 2020-07-03T02:18:33+05:30 IST
సింగర్గా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె, రీసెంట్గా వచ్చిన ‘పలాస 1978’ చిత్రంలో నటుడిగానూ మంచి ప్రతిభను
![రివ్యూస్ దెబ్బకి ఇదే థియేటర్ రిలీజ్ అయితే.. : రఘు కుంచె](https://media.chitrajyothy.com/appimg/galleries/2020070208453820/07022020204831n80.jpg)
సింగర్గా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె, రీసెంట్గా వచ్చిన ‘పలాస 1978’ చిత్రంలో నటుడిగానూ మంచి ప్రతిభను కనబరిచారు. ఇప్పుడాయన ఓ సినిమాను నిర్మించడంలో భాగస్వామి అయ్యారు. సత్యదేవ్, పూజా జవేరి, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హరితేజ తదితరులు నటించిన ‘47 డేస్’ చిత్రాన్ని మద్దాలి దర్శకత్వంలో మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి రఘు కుంచె నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో విడుదలైంది. అయితే ఈ సినిమాకు వచ్చిన రివ్యూలపై రఘు కుంచె సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.
‘‘అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లందరూ (సామాన్య సినిమా ప్రేమికులు) చాలా చక్కని చిత్రం, నాట్ బ్యాడ్ అని చెప్తున్నారు. అలాగే నిన్న కొంతమంది బాల మేధావులు, మరియు కొంతమంది ‘ప్రాస పక్షులు‘.. వాళ్లు రాసిన రివ్యూస్ దెబ్బకి ఇదే గనుక థియేట్రికల్ రిలీజై ఉంటే ఈ పాటికి దుకాణం సర్దేసేది ఈ సినిమా. ఓటీటీ అవడం వల్ల, మూవీ ఆప్షన్స్ కూడా తక్కువ ఉండడం వల్ల చాలా మంది చూడటం జరిగింది. చూసిన వాళ్లందరూ అన్నది ఒకే మాట.. బానే ఉందిగా. మరి అంత దారుణంగా ఎందుకు రాశారు మరి. వీక్ డే అయినా సరే.. మొదటి రోజు జీ5 వ్యూస్ రిపోర్ట్ కూడా చాలా శాటిస్ఫైడ్గా ఉంది. ఈ విషయంలో సామాన్య సినిమా ప్రేమికులందరికీ ధన్యవాదాలు. అలాగే తమ అద్భుతమైన రివ్యూస్తో చీల్చి చెండాడి అలసి సొలసిన మేధావులందరికీ కోటి దండాలు. 47 డేస్ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. వీలైతే స్నేహితులందరూ ఈ చిత్రం చూడండి. ధన్యవాదాలు..’’ అని రఘు కుంచె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.