కోర్టులకెళ్లి టిక్కెట్ల ధరలు పెంచడం సరికాదు: ఆర్.నారాయణమూర్తి
ABN , First Publish Date - 2020-12-30T01:51:49+05:30 IST
కరోనా సినీ ఇండస్ట్రీనే కాదు.. ప్రేక్షకుడు కూడా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి టిక్కెట్ రేట్స్ పెంచవద్దని కోరుకుంటున్నానని అన్నారు సీనియర్ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి. '

కరోనా సినీ ఇండస్ట్రీనే కాదు.. ప్రేక్షకుడు కూడా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి టిక్కెట్ రేట్స్ పెంచవద్దని కోరుకుంటున్నానని అన్నారు సీనియర్ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి. 'సోలో బ్రతుకే సోబెటర్' థాంక్స్ మీట్కు అతిథిగా హాజరైన ఆర్.నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ "అసలు సినిమాను చూడటానికి థియేటర్కు రావాలా.. వద్దా? అని ప్రేక్షకుడు అనుకుంటున్న సమయమిది. ఈ కరోనా సమయంలో మానవజాతి అల్లకల్లోలమైంది. కరోనా ప్రభావం అన్నీ రంగాలపై పడింది. ముఖ్యంగా సినీ రంగంపై కూడా ఎక్కువగా పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు. సినీ ఇండస్ట్రీ కోసం కేసీఆర్గారు, జగన్గారు ఎన్నో రాయితీలు ప్రకటించారు. 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్ ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆదరణను పొందింది. ఈ సినిమా ఆదరణకు కారణం ప్రేక్షకుడు థియేటర్కు రావడమే కారణం. ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావం వల్ల ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో కోర్టులకు వెళ్లి టెక్కెట్ రేట్స్ పెంచుకోకండి. ఎంత బడ్జెట్ మూవీ అయినా టికెట్ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. కోర్టులకు వెళ్లి టికెట్స్ రేట్స్ పెంచడం కరెక్ట్ కాదు. అలా చేస్తే అది బ్లాక్ మార్కెటింగ్ కాదు.. అథరైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి సినిమా టికెట్ రేట్స్ పెంచకండి. దీనికి సీఎం కేసీఆర్గారు, వైఎస్ జగన్గారు.. టికెట్ రేట్స్ పెంచడానికి ఒప్పుకోవద్దని కోరుతున్నాను" అన్నారు.