థియేటర్లలోనే ‘మాస్టర్‌’ విడుదల చేస్తామని నిర్మాతల ప్రకటన

ABN , First Publish Date - 2020-05-04T19:38:56+05:30 IST

కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తరువాత ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్ల లోనే విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు.

థియేటర్లలోనే ‘మాస్టర్‌’ విడుదల చేస్తామని నిర్మాతల ప్రకటన

కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తరువాత ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్ల లోనే విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఇలయ దళపతి విజయ్‌, మక్కల్‌సెల్వన్‌ విజయ్‌సేతు పతి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్‌ ‘మాస్టర్‌’. ఈ సినిమా విడుదల పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో చిత్ర నిర్మాణసంస్థ స్పందించింది. నిజానికి గత ఏప్రిల్‌ 9వ తేదీన ‘మాస్టర్‌’ విడుదల కావాల్సింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమా విడుదల ఆగిపోయింది. మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలీని పరిస్థితి నెలకొనడంతో పలు చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాల్‌’ను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ‘మాస్టర్‌’ను కూడా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర సహ నిర్మాత లలిత్‌కుమార్‌ స్పందిస్తూ, ‘మాస్టర్‌’ చిత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేయబోమని, కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తరువాత థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-04T19:38:56+05:30 IST