‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ 3వ దశను ప్రారంభించిన ప్రభాస్

ABN , First Publish Date - 2020-06-12T00:19:16+05:30 IST

‘పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ 3వ దశకు చేరుకుంది. రెబల్ స్టార్

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ 3వ దశను ప్రారంభించిన ప్రభాస్

‘పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ 3వ దశకు చేరుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు శ్రీకారం చుట్టారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నది. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్యక్రమం నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. అందుకే వారి స్ఫూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాను. సంతోష్ కుమార్‌గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బాగుంటుందని నా భావన. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు నామినేట్ చేస్తున్నాను..’’ అని తెలిపారు. 


అనంతరం జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌గారిది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. వారు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకం. ఇంత మంచి మనస్సున్న ప్రభాస్ చేతులమీదగా ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మూడవ దశ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ‘ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి’ నేలతల్లికి పచ్చని పందిరివేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సమన్వయకర్త సంజీవ్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.











Updated Date - 2020-06-12T00:19:16+05:30 IST