యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి అసహనం

ABN , First Publish Date - 2020-05-25T03:34:09+05:30 IST

ప్రభాస్ సొంత బ్యానర్ అయినటువంటి యూవీ క్రియేషన్స్‌పై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అల్లరల్లరి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసహనం

యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి అసహనం

ప్రభాస్ సొంత బ్యానర్ అయినటువంటి యూవీ క్రియేషన్స్‌పై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అల్లరల్లరి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసహనం కాదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్’ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ సృష్టిస్తున్న హంగామా మాములుగా లేదు. ఒక నెల క్రితం కూడా ఇలాగే ‘బ్యాన్ యూవీ క్రియేషన్స్’ అనే ట్యాగ్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి చేశారు. అయితే ఇదంతా దేనికోసం అంటే.. ప్రభాస్ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వమనే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం ఈ బ్యానర్‌లో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ లేదంటే సినిమా టైటిల్ ఏదో ఒకటి అప్‌డేట్ విడుదల చేసే వరకు వారి కోపం తగ్గేలా లేదు.


అయితే లాక్‌డౌన్ పరిస్థితుల గురించి వివరిస్తూ.. అభిమానులను అప్పట్లో శాంతపరిచారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. కానీ ఇప్పుడు మాత్రం అభిమానులు అస్సలు తగ్గడం లేదు. ఒకవైపు షూటింగ్స్ ఆగిపోయి ఎలారా దేవుడా అని నిర్మాతలు తలలు పట్టుకుంటుంటే.. గోల్డెన్ హార్ట్ కలిగిన ప్రభాస్‌కి అభిమానులైన వారు అర్థం చేసుకోకుండా ఇలా చేయడం ఏం బాగా లేదంటూ ప్రభాస్ అభిమానులపై పంచ్‌లు కూడా పడుతున్నాయి. ఏదిఏమైనా ఇటువంటివి పెద్దవికానివ్వకూడదు. వెంటనే ప్రభాస్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేస్తేనే కానీ అభిమానులు శాంతించేలా లేరు. మరి యూవీ క్రియేషన్స్ వారు ఆ పని చేస్తారో.. లేదో.. చూద్దాం. 

Updated Date - 2020-05-25T03:34:09+05:30 IST