అపోహలు వద్దు.. రక్తదానం చేయండి: నాని
ABN , First Publish Date - 2020-04-16T03:25:16+05:30 IST
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే అదునుగా సామాజిక మాధ్యమాల్లోనూ పలు రకాలైన పుకార్లను కొందరు పట్టిస్తున్నారు. ఈ అపోహలను తొలగించడానికి హీరో నాని ముందడుగు వేశారు.

కోవిడ్ 19 ప్రభావంతో సినీ సామాన్యులు, సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే బయట ప్రజల సహకారంతో తొలిగిపోయే చాలా సమస్యలున్నాయి. చాలా మందికి రక్తం అవసరం అవుతుంది. ఆపరేషన్స్ సహా పలు సందర్భాల్లో రక్తం అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే అదునుగా సామాజిక మాధ్యమాల్లోనూ పలు రకాలైన పుకార్లను కొందరు పట్టిస్తున్నారు. ఈ అపోహలను తొలగించడానికి హీరో నాని ముందడుగు వేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో ఆయన రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలెవరూ బయటకు రావడం లేదు. కానీ బయట మనకు తెలియని సమస్యలు కొందరిని ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి వాటిలో తల్సీమియా అనేది ఒకటి . దీని వల్ల 3500 పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వీరికి రోజుకు రెండుసార్లు రక్తాన్నిఎక్కించాల్సి ఉంటుంది. దీంతో పాటు చాలా ఆరోగ్య సమస్యల నివారణకు రక్తం అవసరం ఎంతో ఉంది. అనవసర భయాల వల్ల ఎవరూ రక్తదానం చేయడం లేదు. ఈ రక్తదానం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. కాబట్టి మన భయాలను పక్కన పెట్టి రక్తదానం చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.
రక్తదానం చేసిన హీరో నానికి ఎన్టీఆర్ ట్రస్ట్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Read more