నాగ్ దారిలోనే నాగచైతన్య
ABN , First Publish Date - 2020-09-07T21:33:14+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ ఎక్కడివక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు అనుమతులు

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ ఎక్కడివక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా.. ధైర్యంగా షూటింగ్ చేయడానికి ఇప్పటి వరకు సెలబ్రిటీలు ముందుకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోలలో కింగ్ నాగార్జున ఇప్పటికే బిగ్బాస్ షోతో పాటు తను చేస్తున్న వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు నాగ్నే ఫాలో అవుతున్నాడు ఆయన తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య.
నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్గా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్స్టోరీ'. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తాజాగా మొదలైంది. సోమవారం నుంచి ఏకధాటిగా 15 రోజుల పాటు షూటింగ్ జరిపి టాకీపార్ట్ పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటిస్తూ.. లొకేషన్లో కేవలం 15 మంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘లాక్డౌన్ వల్ల వాయిదా పడిన మా ‘లవ్ స్టోరి’ షూటింగ్ను ఈ రోజు(సోమవారం) నుంచి మళ్లీ మొదలు పెడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అన్నీ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నాం. లొకేషన్లో కేవలం 15 మంది ఉండేలా చూసుకుంటున్నాం. షూటింగ్లో పాల్గొనేవారందరికీ ముందే కరోనా టెస్ట్లు నిర్వహించాం. వాళ్లంతా షెడ్యూల్ కంప్లీట్ అయ్యే వరకు ఇంటికి వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేలా ఏర్పాట్లు చేసాం. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం. 15 రోజుల పాటు నాన్ స్టాప్గా షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేస్తాం. సరైన సమయం చూసుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం..’’ అని తెలిపారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
