24న ‘మర్డర్’.. 22న అక్కడ ప్రెస్‌ మీట్‌: వర్మ

ABN , First Publish Date - 2020-12-18T22:48:03+05:30 IST

రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ పేరుకి పరిచయం అక్కరలేదు. కాంట్రవర్శీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వర్మ.. కొంతకాలంగా కామ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో

24న ‘మర్డర్’.. 22న అక్కడ ప్రెస్‌ మీట్‌: వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ పేరుకి పరిచయం అక్కరలేదు. కాంట్రవర్శీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వర్మ.. కొంతకాలంగా కామ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో రూపొందిన 'మర్డర్‌' చిత్రం విడుదలకు దగ్గరవడంతో మళ్లీ వర్మ హడావుడి మొదలైంది. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం 'మర్డర్'. ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ చిత్ర విడుదల వివరాలను తెలియజేసింది. అంతకంటే ముందు రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు.


వర్మ మాట్లాడుతూ.. ''ఈ రామ్‌ గోపాల్ వర్మ 'మర్డర్' సినిమా ఎన్నో నిజ జీవితాలపై తీసిన యదార్థ కథ. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. కాబట్టి మేము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ సినిమా పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే కంటిన్యూ యుద్ధం. వారి ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఏం నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా తెలుపుతున్నామని అన్నారు.


ఇక చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు ఆనంద్‌ చంద్ర మాట్లాడుతూ.. ''రామ్‌ గోపాల్ వర్మ 'మర్డర్' సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా పూర్తి ఎమోషన్ కంటెంట్‌తో తీసిన కుటుంబ కథా చిత్రం. ఇది ప్రతి తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాపై చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. వాటన్నిటికీ ఈ మర్డర్ సినిమా 24న సమాధానం చెబుతుంది. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.." అని తెలిపారు.


నిర్మాతలు మాట్లాడుతూ.. ''కొంతమంది ఈ సినిమాపై వేసిన కేసుల వల్ల సినిమా రిలీజ్‌ ఆలస్యమైంది. ఇప్పుడు అన్ని అడ్డంకులను ఎదుర్కొని రామ్‌ గోపాల్ వర్మ 'మర్డర్' సినిమాను ఈ నెల 24న థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాము. ఇందులో మేము నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నాము. తల్లితండ్రులు వారి పిల్లలపై చూపించే అతి ప్రేమతో పాటు వారితో ఉన్న ఎక్కువ అటాచ్‌మెంట్ వల్ల ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథాంశం. మేము సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి.. మాకు కొంతమంది బెదిరింపు కాల్స్ చేసి మిర్యాలగూడలో సినిమా విడుదల చేస్తే థియేటర్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. మీరు ముందు సినిమా చూసి అందులో మీ పేరు ఉంటే మాట్లాడండి. సినిమాను ఆపే హక్కు ఎవరికీ లేదు. అలాకాకుండా సినిమా ఆపేస్తామని ముందుకు వస్తే మేము యస్.పికి కంప్లైంట్ చేసి మీపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటాం. మిర్యాలగూడ కేవలం రెండు కుటుంబాలది కాదు. బెదిరింపులకు భయపడం. మీరు ధ్వంసం చేయాలనుకుంటే థియేటర్‌ని కాదు. ఆరోజు మేము, రాంగోపాల్ వర్మ  థియేటర్ల దగ్గరకి వస్తాము. మొదట మమ్మల్ని టచ్‌ చేసి.. ఆ తర్వాత థియేటర్లను ధ్వంసం చేయండి. మేము ఎవరినీ కించపరచడానికి ఈ చిత్రం తీయలేదు. ఈ సినిమాను మేము చట్టపరంగా విడుదల చేస్తున్నాం.." అని అన్నారు.


గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. ''ఒక అమ్మాయి వారి తల్లిదండ్రులను కాదనుకొని బయటకు వెళ్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూయించారు. ఇది తల్లిదండ్రులందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ కథ నచ్చి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాను నేను ఫ్యామిలీతో కలిసి చూడడం జరిగింది. సినిమా చూసిన మా పిల్లలు, నా భర్త ఎంతో ఎమోషన్ అయ్యారు. వారిలాగే ఈ సినిమా చూసిన వారందరూ తప్పక ఎమోషన్‌కు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది.." అని తెలిపారు. 

Updated Date - 2020-12-18T22:48:03+05:30 IST