రామ్చరణ్ క్లాప్తో మొదలైన ‘అహం బ్రహ్మాస్మి’
ABN , First Publish Date - 2020-03-06T22:04:01+05:30 IST
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కథానాయకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. ఈ చిత్రంతో శ్రీకాంత్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కథానాయకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్స్ బ్యానర్పై మనోజ్ కుమార్ మంచు, నిర్మలాదేవి మంచు నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఫిలిం నగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మంచు మనోజ్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్స్టార్ రామ్చరణ్ క్లాప్నిచ్చారు. మంచు లక్ష్మి, సుస్మిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు. విద్యా నిర్వాణ మంచు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, పరుచూరి గోపాలకృష్ణ సంయుక్తంగా దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాని నేనే నిర్మిస్తున్నాను. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. యంగ్ టీమ్తో పనిచేస్తున్నాను. సినిమా అదిరిపోతుంది. ఈ సినిమాతో ప్రేక్షకుల్నీ, అభిమానుల్నీ ఎంటర్టైన్ చేస్తానని ఆశిస్తున్నా. ఓపెనింగ్కు వచ్చి క్లాప్ కొట్టిన నా బెస్ట్ ఫ్రెండ్ రామ్చరణ్కు థ్యాంక్స్’’ అని చెప్పారు.
దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. జూన్ లోగా సినిమాను పూర్తి చేయాలని సంకల్పించాం. మే నెలలో పీటర్ హేయిన్స్ సారథ్యంలో హైదరాబాద్లో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు.
సంగీత దర్శకుడు అచ్చు రాజమణి మాట్లాడుతూ.. ‘‘బిగ్ స్కేల్లో ఈ సినిమా ఉండబోతోంది. పాటలు, నేపథ్య సంగీతం కొత్తగా ఉంటాయి. అనంత శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి పాటలు రాశారు. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇది’’ అని అన్నారు.
మరో సంగీత దర్శకుడు రమేష్ తమిళమణి మాట్లాడుతూ ఇందులో ఒక పాటకు సంగీతాన్ని అందిస్తున్నానని చెప్పారు.
కథానాయిక ప్రియాభవానీ శంకర్ మాట్లాడుతూ.. మంచి సినిమాలో తనను భాగం చేసిన మోహన్బాబు, మనోజ్, శ్రీకాంత్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సముద్రఖని, మురళీశర్మ, రఘుబాబు, రాజీవ్ కనకాల, సుదర్శన్, రామ్ప్రసాద్, ప్రదీప్ రావత్, శ్రీకాంత్ అయ్యంగార్, చమ్మక్ చంద్ర, విశ్వాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.