బర్త్డే స్పెషల్: న్యూ షో ప్రకటించిన మంచు లక్ష్మీ
ABN , First Publish Date - 2020-10-08T23:24:13+05:30 IST
లక్ష్మీ మంచు.. నటుడు మోహన్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని వెండితెర అలాగే బుల్లితెరపై సంపాదించుకున్నారు. లక్ష్మీ
లక్ష్మీ మంచు.. నటుడు మోహన్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని వెండితెర అలాగే బుల్లితెరపై సంపాదించుకున్నారు. లక్ష్మీ మంచు తన కెరీర్లో ఓ నటిగా అమెరికన్ టీవీ సిరీస్ 'లాస్ వేగాస్'తో ప్రారంభించారు. మరికొన్ని ఇంగ్లీష్ టీవీ షోలలో నటించాక ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. టాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చి, తనదైన ముద్ర వేశారు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే, తెలుగు టీవీ షోలకు ప్రెజెంటర్గా వ్యవహరిస్తూ వచ్చారు లక్ష్మి. ఆమె హోస్ట్గా వ్యవహరించిన 'ఫీట్ అప్ విత్ స్టార్స్' చాట్ షోకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పీరియడ్లో 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' పేరుతో పలువురు ఫేమస్ సినీ, పొలిటికల్ సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె ఇంటరాక్ట్ అయ్యారు.
అక్టోబర్ 8 లక్ష్మీ మంచు బర్త్డే. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రోమో ద్వారా తన నూతన షోను ప్రకటించారు. సౌత్ బే సమర్పిస్తోన్న ఆ షో పేరు 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు'. 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' తరహాలోనే, ఈ షోలో ఆమె ఫిలిమ్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్.. తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రోమోలో రాజమౌళి, తాప్సీ పన్ను, సెందిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాష్ అమృతరాజ్, శంతను, నిఖిల్, బిభు మొహాపాత్ర, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ తదితర ఫేమస్ పర్సన్స్ కనిపిస్తున్నారు. ఈ 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు' షో త్వరలోనే ప్రారంభం కానున్నది.