ఆ ప్రేమలేఖను భద్రంగా దాచుకున్నా: కీర్తి సురేష్
ABN , First Publish Date - 2020-07-29T20:48:16+05:30 IST
‘ఆ ప్రేమలేఖను పారవేయడానికి మనసొప్పలేదు. ఆ లేఖను భద్రంగా దాచుకున్నాను’ అంటూ చెబుతున్నారు అందాల నటి కీర్తి సురేష్.
![ఆ ప్రేమలేఖను భద్రంగా దాచుకున్నా: కీర్తి సురేష్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020072903172585/07292020151807n43.jpg)
‘ఆ ప్రేమలేఖను పారవేయడానికి మనసొప్పలేదు. ఆ లేఖను భద్రంగా దాచుకున్నాను’ అంటూ చెబుతున్నారు అందాల నటి కీర్తి సురేష్. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెబుతున్న కీర్తి సురేష్ తన వద్దనున్న ఓ ప్రేమ లేఖను గురించి నెటిజన్లకు వివరించారు. ‘ఇదు ఎన్న మాయం?’ అనే చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమైన కీర్తి సురేష్ ప్రముఖ హీరోలు విజయ్, సూర్య, విక్రమ్తో నటించి స్వల్ప కాలంలోనే అగ్రనటిగా పేరుతెచ్చుకున్నారు. పలు కమర్షియల్ చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ కెరీర్ ‘మహానటి’ చిత్రంతో ఉన్నత స్థితికి చేరింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన కీర్తి సురేష్కు ఓ వీరాభిమాని ఓ గిప్ట్ బాక్స్ ఇచ్చాడు. దానిని తెరచి చూస్తే అందులో కీర్తి సురేష్ ఫొటోలతో కూడిన ఆల్బమ్, ఓ ప్రేమలేఖ ఉన్నాయి. ఆ లేఖలో కీర్తిసురేష్ను ఆరాధిస్తున్నానని, వీలైతే పెళ్ళి చేసుకుంటానని తెలుపుతూ, ఆమె అందచందాలను కూడా విపరీతంగా పొగుడుతూ కవితా ధోరణితో వర్ణించాడు. తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరూ తనకు ప్రేమలేఖ రాయలేదని, తొలిసారిగా అభిమాని రాసిన ప్రేమ లేఖను పారవేయడానికి మనసొప్ప లేదని, ఆ లేఖను భద్రంగా దాచి పెట్టుకున్నానని కీర్తి సురేష్ తెలిపారు.