సినిమా, టీవీ షూటింగ్లకు కేసీఆర్ అనుమతి....ధియేటర్లకు నో పర్మిషన్
ABN , First Publish Date - 2020-06-08T22:18:41+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతిచ్చారు.
![సినిమా, టీవీ షూటింగ్లకు కేసీఆర్ అనుమతి....ధియేటర్లకు నో పర్మిషన్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020060804465963/06082020165437n9.jpg)
హైదరాబాద్: తెలంగాణలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని తెలిపారు.
అయితే అదే సమయంలో థియేటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదాను రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని, అనుమతి ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు కోరారు.