తెలుగు నుంచి ‘జెర్సీ’.. తమిళ్ నుంచి ‘ఖైదీ’
ABN , First Publish Date - 2020-08-02T05:03:44+05:30 IST
భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు తెలుగు చిత్రం ‘జెర్సీ’ ఎంపికైన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ప్రముఖ చలన చిత్ర
![తెలుగు నుంచి ‘జెర్సీ’.. తమిళ్ నుంచి ‘ఖైదీ’](https://media.chitrajyothy.com/appimg/galleries/2020080111290650/08012020233334n34.jpg)
భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు తెలుగు చిత్రం ‘జెర్సీ’ ఎంపికైన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’ తెలుగునాట ఘన విజయం సాధించటమే కాక, పలు ప్రశంసలు అందుకుందీ చిత్రం. సంగీత దర్శకుడు అనిరుద్ ‘జెర్సీ’ చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోశారు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఒడి గెలిచిన తీరు హృద్యంగా ఈ ‘జెర్సీ’ చిత్రంలో చూపించారు.
ఇక తెలుగు నుంచి ‘జెర్సీ’ చిత్రం ఎంపికైతే.. ఇదే చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు తమిళ్ నుంచి కార్తీ నటించిన ఖైదీ చిత్రం ఎంపికైంది. ఒక్క రాత్రి జరిగే కథతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తన పాపను కలుసుకోవడానికి జైలు నుంచి ఓ తండ్రి రావడం, ఆ పాపను చూసినప్పుడు అతని భావోద్వేగం, ఈ జర్నీలో జరిగే సంఘటనలు.. ఇలా అన్నీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ రెండు చిత్రాలు భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికవటం, ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ చిత్రాలు ప్రదర్శనకు నోచుకోవటం ఎంతో సంతోషంగా ఉందంటూ ఇరు చిత్ర వర్గాలు తమ ఆనందాన్ని తెలియజేశారు.