ఇక నో పాలిటిక్స్‌: మెగాస్టార్‌ చిరంజీవి

ABN , First Publish Date - 2020-12-26T03:32:01+05:30 IST

వెండితెరపై నెంబర్‌ వన్‌ హీరోగా రాజ్యమేలుతోన్న మెగాస్టార్‌ చిరంజీవి.. మధ్యలో 10 సంవత్సరాలు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి

ఇక నో పాలిటిక్స్‌: మెగాస్టార్‌ చిరంజీవి

వెండితెరపై నెంబర్‌ వన్‌ హీరోగా రాజ్యమేలుతోన్న మెగాస్టార్‌ చిరంజీవి.. మధ్యలో 10 సంవత్సరాలు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ప్రజలకు సేవ చేద్దామని వెళ్లిన చిరంజీవి.. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ఆ తర్వాత రాజకీయాలు మనకి పడవని తెలుసుకున్న చిరంజీవి తిరిగి మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటే.. మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నారని, ఆయనకు ఓ జాతీయ పార్టీ సీఎం పదవిని ఆఫర్‌ చేస్తుందనే వార్తలు ఈ మధ్య గట్టిగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అలాంటి వార్తలన్నింటికీ తాజాగా ఆయన ఓ షోలో క్లారిటీ ఇచ్చేశారు.


తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్టార్‌ హీరోయిన్‌ సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌జామ్‌' షోలో చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి పాల్గొన్న మెగా షోని 'ఆహా' ఓటీటీ క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసింది. ఈ షో లో చిరంజీవి.. 10 సంవత్సరాలలో చాలా తెలుసుకున్నానని, పాలిటిక్స్‌ అసలు తనకు సెట్‌ అవ్వవని తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని తెలిపిన చిరు.. ఇకపై రాజకీయాల జోలికి పోనని తెలిపారు. అలాగే మరో జన్మంటూ ఉంటే కూడా.. అప్పుడు కూడా నటుడిగానే ఉండాలని కోరుకుంటానని తెలిపారు. ఈ సమాధానంతో మళ్లీ రాజకీయాలలోకి అంటూ వస్తున్న రూమర్లకు బ్రేక్‌ వేశారు చిరు.  

Updated Date - 2020-12-26T03:32:01+05:30 IST