చిరంజీవి ఇంట్లో ముగిసిన సమావేశం.. బాలయ్య వ్యాఖ్యలపై ఎవరేమన్నారంటే...

ABN , First Publish Date - 2020-05-29T18:48:21+05:30 IST

సినీ నటుడు చిరంజీవి ఇంట్లో సీసీసీ సభ్యుల సమావేశం ముగిసింది. మరోసారి సమావేశం కావాలని...

చిరంజీవి ఇంట్లో ముగిసిన సమావేశం.. బాలయ్య వ్యాఖ్యలపై ఎవరేమన్నారంటే...

హైదరాబాద్‌: సినీ నటుడు చిరంజీవి ఇంట్లో సీసీసీ సభ్యుల సమావేశం ముగిసింది. మరోసారి సమావేశం కావాలని సభ్యులు నిర్ణయించారు. మొదటి విడత సాయం అందని వారికి రెండో విడతలో సాయం అందజేయాలని చిరంజీవి చెప్పారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బాలయ్య వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. అవసరం ఉన్నవాళ్లని పిలిచి ఉంటారని, బాలకృష్ణతో అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళతారని చెప్పారు. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.


బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఆయన వ్యక్తిగతమని చెప్పారు. సీసీసీ సమావేశంలో ఇవేవి చర్చకు రాలేదని తమ్మారెడ్డి చెప్పుకురావడం కొసమెరుపు. సినీ నిర్మాత సి. కళ్యాణ్ బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఫ్లోలో అలా అన్నారో తనకు తెలియదని, సీఎం కేసీఆర్‌ చెప్పిన వారినే పిలిచారని తాను భావిస్తున్నానని చెప్పారు. తొలివిడత పంపిణీపై రివ్యూ మీటింగ్‌ జరిగిందని నటుడు బెనర్జీ తెలిపారు.


బాలయ్య వ్యాఖ్యలివి...

‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు తెలియదు. వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి, (తెలంగాణ ప్రభుత్వంతో) ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు’’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ‘‘మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? ఎవరూ పిలవలేదు. వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? (మంత్రి తలసాని) శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్‌ అవుతాయని మీటింగులు జరిగాయి. నన్ను ఒక్కడు పిలవలేదు. భూములు పంచుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? వక్రీకరించేది ఏంటి... ఇది వాస్తవం’’ అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.


బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఇది..

అయితే.. ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ‘‘ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప... భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. నాతో సహా చాలామందిని పిలవలేదు. భూములు పంచుకుంటున్నారని అనడం ఏంటి? ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా? తప్పుగా మాట్లాడారు. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారు. ఇండస్ట్రీకీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పండి. అది మీ బాధ్యత’’ అన్నారు.

Updated Date - 2020-05-29T18:48:21+05:30 IST