బ్యాడ్‌బాయ్స్‌ అత్యాశ

ABN , First Publish Date - 2020-10-25T05:52:00+05:30 IST

నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీ సిరీస్‌ ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌: ఇండయా’ మనదే శంలో ముగ్గురు వ్యాపారవేత్తలు చేసిన ఆర్థిక మోసాలను ఆవిష్కరించింది...

బ్యాడ్‌బాయ్స్‌ అత్యాశ

నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీ సిరీస్‌ ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌: ఇండయా’ మనదే శంలో ముగ్గురు వ్యాపారవేత్తలు చేసిన ఆర్థిక మోసాలను ఆవిష్కరించింది. చట్టపరమైన అడ్డంకులు దాటుకొని ఈ వారం విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌ ఆసక్తి రేపుతోంది.


నాలుగు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్‌లో మూడు ఎపిసోడ్లలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, సహారా గ్రూప్‌ చైర్మన్‌ సుబ్రతా రాయ్‌ వంటి ఆర్థిక నేరగాళ్ల జీవితాలను ఎంతో చక్కగా చూపించింది. వీళ్లు వ్యాపారంలోకి ఎలా అడుగుపెట్టారు, అతిపెద్ద వ్యాపారవేత్తలుగా ఎలా ఎదిగారు, బ్యాంకులను మోసం చేసి ఎలా పతనానికి చేరువయ్యారు వంటి విషయాలను చాలా చక్కగా ఆవిష్కరించిందీ సిరీస్‌.

మొదటి ఎపిసోడ్‌ పుట్టుకతోనే ధనవంతుడైన విజయ్‌మాల్యా కథతో మొదలవుతుంది. మద్యం వ్యాపారంలో మాల్యా కింగ్‌ఫిషర్‌ బీర్‌ బ్రాండ్‌తో సంచలనం సృష్టించడం, ఆ తరువాత విమానయాన రంగంలో కూడా అడుగుపెట్టడం, అయితే నష్టాలు రావడంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో నిలవడం, చివరకు పతనమవడం... ఇలా ప్రతిదీ చాలా బాగా చూపించారు. రెండో ఎపిసోడ్‌ ఒక చిన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి కోట్లలో అప్పు తీసుకొని విదేశాల్లో వ్యాపారాన్ని ఎలా విస్తరించాడు, అప్పులు ఎగ్గొట్టి లండన్‌కు ఎలా పారిపోయాడు, అక్కడ ఎలా అరెస్ట్‌ అయ్యాడు... అనేది చాలా చక్కగా తెరకెక్కించారు. ఒక చిన్నస్థాయి చిట్‌ఫండ్‌ బ్రోకర్‌ అయిన సుబ్రతా రాయ్‌ దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఎలా అయ్యాడో మూడో ఎపిసోడ్‌లో చూడొచ్చు. చిట్‌ఫండ్‌ కంపెనీ ద్వారా ప్రజాధనంతో తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న రాయ్‌ ఆర్థిక నేరాలు ఎలా బయటపడ్డాయి వంటివి ఆసక్తికరంగా ఉంటాయి.


‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌: ఇండియా’ వెబ్‌సిరీస్‌లో ఈ మూడు ఎపిసోడ్‌లలో నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు.

Updated Date - 2020-10-25T05:52:00+05:30 IST