స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు: జీవిత రాజ‌శేఖ‌ర్

ABN , First Publish Date - 2020-02-16T01:10:28+05:30 IST

సీనియ‌ర్ నటి ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో, ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గుర‌వ‌య్యలు కలసి

స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు: జీవిత రాజ‌శేఖ‌ర్

సీనియ‌ర్ నటి ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో, ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గుర‌వ‌య్యలు కలసి శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం ‘అమ్మ‌దీవెన‌’. ఈ చిత్ర ట్రైల‌ర్‌ని సీనియ‌ర్ నటి జీవిత రాజ‌శేఖ‌ర్ విడుద‌ల చేశారు. 


ట్రైలర్ విడుదల అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘అమ్మదీవెన డైరెక్టర్ శివ, గురువయ్య గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్ర హీరోయిన్ ఆమని మంచి నటి, రాజశేఖర్‌గారితో అమ్మకొడుకు మూవీలో నటించినప్పటి నుంచి ఆమనిగారు నాకు పరిచయం. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మేము ఆమని మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నాము. అలాగే ఆమని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత తాను మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి, మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీశారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మదీవెన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరి ఆదరాభిమానులు పొందాలని ఆశిస్తున్నాను..’’ అన్నారు.


ఆమని మాట్లాడుతూ.. లక్ష్మమ్మ బ్యానర్‌పై శివ దర్శకత్వంలో గురువయ్య నిర్మిస్తోన్న చిత్రం అమ్మ దీవెన. ఈ సినిమాలో మరో మంచి పాత్రలో నటించాను. నా రీ ఎంట్రీ ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన జీవిత రాజశేఖర్‌గారు మా సినిమాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. మగదిక్కు లేని కుటుంబంలో స్త్రీ ఐదు మంది పిల్లల్ని ఎలా చదివించింది, వారికి మంచి భవిషత్తు ఎలా ఇచ్చింది అనేది ఈ సినిమా. మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అందుకు అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.


‘‘ట్రైలర్ లాంచ్ చేసిన జీవితగారికి నా హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు. ఆమనిగారికి కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగులుతుంది, షూటింగ్ సమయంలో ఎదురయ్యే ఏ సమస్యను కూడా నా వరకు రాకుండా దర్శకుడు శివ అన్నీ తానై నడిపించాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింది.  ఒక బాధ్యత లేని భర్తతో ఐదుగురు పిల్ల‌ల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ప‌డింది. వారిని ఎలా ప్రయోజకుల్ని చేసింది అనేది క‌థాంశం. త‌ప్ప‌కుండా మీ అంద‌రి ఆశీస్సులు కావాలి..’’ అని నిర్మాత మారయ్య అన్నారు. 


ద‌ర్శ‌కుడు శివ ఏటూరి మాట్లాడుతూ.. ‘‘ట్రైల‌ర్ లాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కి నచ్చేలా ఉంటుంది. ఆమని, పోసాని గార్లు తల్లిదండ్రులుగా చాలా బాగా చేశారు. వెంకట్ అజ్మీర సంగీతం, మనోహర్ కెమెరా వర్క్, శ్రీను డైలాగ్స్, జానకిరామ్ ఎడిటింగ్ ఇలా అందరూ తమ బెస్ట్ ఇచ్చారు, నిర్మాత మారయ్య గారు ఒక మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు. 

Updated Date - 2020-02-16T01:10:28+05:30 IST