రోజూ 4,500 ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న అమితాబ్
ABN , First Publish Date - 2020-05-27T14:42:29+05:30 IST
కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్లో అవస్థలు పడుతున్న వలస కూలీలకు బాలీవుడ్ తారలు చేయూతను అందిస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్లో అవస్థలు పడుతున్న వలస కూలీలకు బాలీవుడ్ తారలు చేయూతను అందిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తన ఎబి కార్ప్ లిమిటెడ్ తరపున మార్చి 28 నుంచి ముంబైలోని హాజీ అలీ దర్గా, అన్టాప్ హిల్, జుహు తదితర ప్రదేశాలలో ప్రతిరోజూ 4500 ప్యాకెట్ల ఆహార ప్యాకెట్లను పేదలకు పంపిణీ చేస్తున్నారు. అలాగే 10 వేల కుటుంబాలకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. ఇంతే కాకుండా అమితాబ్ బృందం మే 9 నుండి ప్రతిరోజూ 2000 డ్రై ఫుడ్ ప్యాకెట్లు, 2000 వాటర్ బాటిల్స్ సుమారు 1200 జత చెప్పులను పేదలకు పంపిణీ చేస్తూ వస్తోంది. అలాగే వలస కూలీలు వెళ్లేందుకు 10కి పైగా బస్సులను ఏర్పాటు చేశారు. అమితాబ్ బచ్చన్ కార్యాలయం మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేసింది. వీటికి తోడు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, బీఎంసీ కార్యాలయాలు, అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాల్లోని వారి కోసం 20 వేలకుపైగా పీపీఈ కిట్లను అందించింది.