హ్యాపీగా ఉండండి అంటూ అజయ్ దేవగన్ సాంగ్
ABN , First Publish Date - 2020-04-28T00:42:36+05:30 IST
కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయాందోళనలో మునిగిపోయి ఉన్న తరుణంలో ప్రతీ ఒక్కరు ఇతరులలో ధైర్యం నింపడానికి తమ వంతు కృషి
![హ్యాపీగా ఉండండి అంటూ అజయ్ దేవగన్ సాంగ్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020042706435659/04272020190354n74.jpg)
ముంబై: కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయాందోళనలో మునిగిపోయి ఉన్న తరుణంలో ప్రతీ ఒక్కరు ఇతరులలో ధైర్యం నింపడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలతో కొందరు వీడియోలు రూపొందించి సోషల్మీడియాలో పెడుతున్నారు. ఇక సెలబ్రిటీలు.. ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రత్యేకంగా పాటలు రూపొందించిన విడుదల చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఇదే పని చేశారు. ‘‘తాహర్ జా’’ అనే పేరుతో ఆయన ఓ పాటని విడుదల చేశారు. ఈ పాట మొత్తం అజయ్ ఇంట్లోనే చిత్రీకరించగా.. ఆయన 9 సంవత్సరాల కుమారుడు యుగ్ దేవగన్ ఈ పాటకి అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు.
ఈ సమయంలో ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ సంతోషంగా ఉండాలని.. ఇతరులు కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని ఈ పాట ద్వారా సందేశం ఇచ్చారు. అంతేకాక.. ఎంత పెద్ద తుఫాను వచ్చినా.. అందరు ఐకమత్యంగా ఉంటూ దాన్ని ఎదురుకుంటామని పాటలో పేర్కొన్నారు.
ఈ పాటకి అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరించగా.. మెహుల్ వ్యాస్ మ్యూజిక్ అందించడంతో పాటు.. పాట కూడా పాడారు. పాటని అనిల్ వర్మ రచించగా.. ధర్మేంద్ర శర్మ ఎడిటింగ్ చేశారు. ఇక నవీన్ పాల్ ఈ పాటకి వీఎఫ్ఎక్స్ అందించారు.